ఆ పార్టీతో పొత్తా: బాబుతో విభేదించిన వంటేరు, సిద్ధంగా లేమంటూ తేల్చేశారు
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మనుగడ కోసం టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై ఆలోచిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాగా, చంద్రబాబు వ్యాఖ్యలను తెలంగాణ నేతలు ఎక్కువ మంది సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు టీఆర్ఎస్ పార్టీలో టీటీడీపీని విలీనం చేయాలని కోరారు. మరికొందరు టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని తేల్చి చెప్పారు.
అవినీతి పార్టీకి మద్దతా?
ఈ నేపథ్యంలో తాజాగా, టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని తెలంగాణ టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి తేల్చి చెప్పారు. అవినీతి ప్రభుత్వానికి టీడీపీ అండగా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
సిద్ధంగా లేరు
టీడీపీలో ప్రస్తుతం ఉన్న నేతలు టీఆర్ఎస్తో పనిచేసేందుకు సిద్ధంగా లేరని ఓంటేరు తేల్చి చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఒంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు పిలుపు
గురువారం టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఒంటేరు ప్రతాప్రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న ఏ నాయకుడిని వదులుకోమని, పల్లెపల్లెకు తెలుగుదేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బాబు పిలుపునిచ్చారు.
ఈ ప్రచారానికి తెర
అయితే ఇటీవల ఒంటేరు ప్రతాప్రెడ్డి టీడీపీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గురువారం టీటీడీపీ నేతల సమావేశానికి వచ్చిన ఒంటేరు ఆ ప్రచారానికి తెరదించారు. అంతేగాక, టీఆర్ఎస్ పార్టీ పొత్తు అంశాన్ని తాను విభేదిస్తున్నట్లు ఓంటేరు అధినేతకు స్పష్టం చేశారు.