ఏరా.. కేసీఆర్ పైనే పోటీ చేస్తావా అని బెదిరించారు, రాత్రి వచ్చి సోదాలు చేశారు: వంటేరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కావాలనే తమ పార్టీ గజ్వెల్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం చెప్పారు. ప్రజాస్వామ్య భారతంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉందని చెప్పారు.
ఓడిపోతాననే భయంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెబితే ఎలా అన్నారు. ఈసీ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. తెలంగాణలో ఇండియన్ పోలీస్ యాక్ట్ అమలులో ఉందా లేక కల్వకుంట్ల చట్టం అమలులో ఉందా అన్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
కేసీఆర్ పైన పోటీ చేయడం తప్పా?
కేసీఆర్ పైన పోటీ చేయడం తప్పు అవుతుందా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
తనపై 23 కేసులు అన్యాయంగా పెట్టారు
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనపై 23 కేసులు అన్యాయంగా పెట్టారని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా పని చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు దాదాపు 45 రోజుల నుంచి గజ్వెల్లోనే ఉండి పని చేస్తున్నారని చెప్పారు. పోలీసులు కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తోందని చెప్పారు. గజ్వెల్లో ఈసీ, పోలీసులు అంతా నిర్వీర్యమయ్యారని, తనలాంటి వారు పోటీ చేయవద్దా అన్నారు.
రాత్రి ఇంటికి వచ్చి సోదాలు చేశారు
పోలీసులు సోమవారం రాత్రి తమ ఇంటికి వచ్చి సోదాలు చేశారని, ఏరా కేసీఆర్ పైనే పోటీ చేస్తావా అని బెదిరించారని వంటేరు ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారు. నేను మాట్లాడేది ఒకటే ఫోన్ నుంచి అని చెప్పారు. ఆంధ్రా డబ్బులతో పోటీ చేస్తున్నానని అంటున్నారని, కేసీఆర్ పాలనలో కాంట్రాక్టర్లు సహా ఎక్కడి వారన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు దీక్ష చేశా
తాను ఆస్తులు అమ్ముకున్నానని వంటేరు చెప్పారు. అభివృద్ధి చేశానని కేసీఆర్ చెబుతున్నారని, ప్రచారం లేకుండా పోటీలో నిలబడదామని, ఎవరు గెలుస్తారో చూద్దామా అని సవాల్ విసిరారు. పోలీసులు, ఈసీ నిర్వీర్యం అయిందని, మీడియా సోదరులు అందరికీ చెప్పాలని అభిప్రాయపడ్డారు. తనను రక్షించడం లేదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్ష చేశానని చెప్పారు. జెండా, అజెండాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటే అయినా ప్రజలకు కనువిప్పు కలుగుతుందని భావించానని చెప్పారు.
కేసీఆర్కు డిపాజిట్ రాని పరిస్థితి అందుకే
కేసీఆర్కు గజ్వెల్ నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని వంటేరు అన్నారు. అందుకే హరీష్ రావుతో పాటు పలువురు తెరాస నేతలు, పక్క నియోజకవర్గ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చునని, కానీ తనపై, తన ఇంటిపై దాడి చేయడం ఏమిటన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
టెంట్ల కింద బార్లు ఓపెన్ చేశారు
గజ్వెల్లో టెంట్ల కింద బార్లు ఓపెన్ చేశారని వంటేరు విమర్శించారు. వేల కోట్ల రూపాయలు పంచి పెడుతున్నారని చెప్పారు. గజ్వెల్ నియోజకవర్గంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని చెప్పారు. పోలీసులు రాత్రి సమయంలో వచ్చి మా ఇంట్లో తనిఖీలు చేయడం ఏమిటని చెప్పారు. కేసీఆర్ పైన పోటీ చేస్తే బెదిరిస్తారా అన్నారు.