కెసిఆర్ వెటాడి, వెంటాడి హతమారస్తున్నాడు: వివి సహా పౌర హక్కుల నేతల ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పనిచేసిన ముస్లింలను, ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్ధులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వేటాడి, వెంటాడి హతమారుస్తున్నాడని పౌర సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్కలా వ్యవహరిస్తానని కేసిఆర్ వేట కుక్కలా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా సెప్టెంబర్ 30న తలపెట్టిన ఛలో అసెంబ్లీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో సోమవారం హైదర్గూడ న్యూస్సెంటర్లో ఛలో అసెంబ్లీ వాల్పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
కెసిఆర్ రక్తం మరిగిన పులిలా మారారని, చరిత్రలో నియంతలకు పట్టిన గతే కెసిఆర్కు పడుతుందని వారన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, విరసం నేత వరవరరావు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క, పివోడబ్ల్యు నాయకురాలు సంధ్య తదితరులు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శాసనసభ సమావేశాల్లో ఎన్కౌంటర్పై ప్రకటన చేయాలని వరవరరావు డిమాండ్ చేశారు. ఈ నెల 30వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని చెప్పారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండల పరిధిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో శృతి అలియాస్ మహిత (23) , విద్యాసాగర్రెడ్డి అలియాస్ సాగర్ (32) మరణించడంపై హైకోర్టులో సోమవారం నాడు పౌరహక్కుల సంఘం నాయకుడు చిలక చంద్రశేఖర్ ప్రజావాజ్యపిటీషన్ దాఖలు చేశారు.
ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు మానవ హక్కుల సంఘం నిబంధనలు పాటించలేదని, తల్లిదండ్రులకు తెలియకుండానే పోస్టుమార్టం చేశారని, చివరికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు వారి విన్నపాన్ని పట్టించుకోలేదని పిటీషన్లో పేర్కొన్నారు. శృతి శరీరంపై గాయాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై కేసు దాఖలు చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు.