ఢిల్లీలో ధర్నా చేసినా పట్టించుకోరన్నట్లుగా: వరుణ్ గాంధీ, మోడీకి తగిలినట్లే!
దేశంలో రాజకీయ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని బిజెపి ఎంపి వరుణ్ గాంధీ అన్నారు. ఆయన మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో భారత్లో రాజకీయ సంస్కరణలు అనే అంశంపై మాట్లాడారు.
హైదరాబాద్: దేశంలో రాజకీయ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని బిజెపి ఎంపి వరుణ్ గాంధీ అన్నారు. ఆయన మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో భారత్లో రాజకీయ సంస్కరణలు అనే అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన నిర్మోహమాటంగా మాట్లాడారు. తమిళనాడు రైతులు, ఇతర రాష్ట్రాల ప్రజలు నిత్యం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తుంటే ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అపోహ ప్రజల్లో ఉందన్నారు.
తద్వారా ఆయన వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి షాకిచ్చేవిలా ఉన్నాయి. గడిచిన అయిదేళ్లలో ఎంపీల జీతం నాలుగుసార్లు పెరిగిందని, అయితే జీతానికి తగ్గట్లు వారు పని చేస్తున్నారా లేదా కేంద్రం పరిశీలించాలన్నారు.
ఎన్నికల విరాళాల పేరిట జాతీయ పార్టీలు కోట్ల రూపాయలు సేకరిస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లోనే జాతీయ పార్టీలు రూ.860 కోట్లు సమకూర్చుకున్నాయన్నారు.
ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా భారీగా పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రూ.594 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పని చేయని ఎంపీలని రీకాల్ చేసే పద్ధతి భారత్లో అమలవుతుందా లేదా చెప్పలేమన్నారు.