విరాళాలు: వీణావాణీల తల్లిదండ్రులకు రాధాకృష్ణ ఎబిఎన్ నుంచి లేఖ
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిల శస్త్రచికిత్స ఖర్చుల కోసం దాతల నుంచి సేకరించిన రూ.4 లక్షలను నిలోఫర్ ఆస్పత్రికి పంపించామని, ఆస్పత్రి వర్గాలు తిరిగి వెనక్కి పంపించాయని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానల్ నుంచి వీణావాణి తల్లిదండ్రులకు లేఖ వచ్చింది. శుక్రవారం ఆ లేఖను వీణావాణి తల్లిదండ్రులు నాగలక్ష్మి, మురళి మీడియాకు చూపించారు.
హైదరాబాద్లోని నిలోఫర్ పిల్లల ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్న వీణావాణిలను విడదీసేందుకు వైద్యానికి అయ్యే ఖర్చుకు తమవంతుగా ప్రయత్నం చేస్తామని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం 2012లో చానల్లో ప్రత్యక్షప్రసారం ఏర్పాటు చేసింది. దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించింది.
ఖర్చులకు రూ.పది వేలు ఇవ్వాలని వీణావాణి తండ్రి మురళి అడిగితే యాజమాన్యం అడిగినా ఫలితం లేకపోయిందని వార్తలు వచ్చాయి. అయితే గత నెల నాలుగో తేదీన యూనియన్ బ్యాంక్ నుంచి రూ.4లక్షలు (డీడీ నంబర్ 481606) నిలోఫర్ ఆస్పత్రికి సూపరింటెండెంట్కు పంపించామని, ఆస్పత్రి వర్గాలు డీడీని తిరస్కరించాయని తెలియజేస్తూ ఏబీఎన్ ఛానల్ యాజమాన్యం నుంచి మురళికి లేఖ వచ్చింది. డీడీని తిరస్కరించడంతో ఆ డబ్బును తిరిగి బ్యాంక్లోనే జమచేశామని తెలిపింది.
వీణావాణిల అవస్థపై ఏబీఎన్లో లైవ్ నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని వీణావాణీల తల్లిదండ్రులు నాగలక్ష్మి, మురళి చెప్పారు. దాతలు ఇచ్చిన డబ్బులను చానల్ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఒకసారి రూ.10 వేలు ఇవ్వాలని ఫోన్చేస్తే విసుక్కున్నారని, అసలు మీకు ఫోన్నంబర్ ఎవరు ఇచ్చారని బెదిరించారని అన్నారు. అప్పుడలా వ్యవహరించి, ఇప్పుడు కేవలం రూ.4 లక్షలు ఉన్నట్లు చూపించడం ఏమిటని అడిగారు. ఇప్పటికైనా దాతల వివరాలతోపాటు ఎంతెంత ఇచ్చారో సమాచారం మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు.