రోహిత్ ఆత్మహత్య, లేఖపై అనుమానం: సుశీల్ని అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులయ్యారంటూ దాఖలైన కేసులో నిందితులుగా ఉన్న ఎబివిపి యూనివర్సిటీ అధ్యక్షులు సుశీల్ కుమార్, కార్యదర్శి కృష్ణచైతన్య, సుశీల్ కుమార్ చిన్నాన్న దివాకర్ల్ని అరెస్ట్ చేయరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కేసు దర్యాప్తును కొనసాగించాలని, పిటిషన్లలో కౌంటరు దాఖలు చేసి రికార్డులను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులయ్యారంటూ ఉపకులపతి, కేంద్ర మంత్రులతోపాటు సుశీల్ కుమార్, కృష్ణచైతన్య తదితరులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సుశీల్ కుమార్, కృష్ణచైతన్య, దివాకర్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సుశీల్ గదికి 30 మంది వచ్చి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అభియోగపత్రం దాఖలైందని, దీనికి కక్షసాధింపుగానే కేసు పెట్టారని అతని తరఫు లాయర్ తెలిపారు.
వీటిపై హైకోర్టు జడ్జి జస్టిస్ పివి సంజయ్ కుమార్ విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉన్నందున పిటిషనర్లను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, రోహిత్కు అంత్యక్రియలు హిందూ స్మశాన వాటికలో చేశారు. తాజాగా, బుద్ధిజం ప్రకారం మరోసారి అంత్యక్రియలు నిర్వహించారు.
రోహిత్ సూసైడ్ నోట్ పైన పోలీసుల దృష్టి
రోహిత్ బలవన్మరణం ఘటనపై కేసు నమోదు చేసినా హెచ్సియూలో ఉద్రిక్తతలపైనే ఇన్నాళ్లూ దృష్టిపెట్టిన పోలీసులు ఇకపై కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా మంగళవారం ముగియనుండడంతో తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.
ఆత్మహత్య అనంతరం లభించిన లేఖ ఈ కేసులో కీలకంగా మారింది. ఆ లేఖలోని రాత రోహిత్దేనా అని తేల్చేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపించాల్సి ఉంది. లేఖలో పది వరుసల వరకు కొట్టివేతలున్నాయి. వీటిని తానే కొట్టివేసినట్లు రోహిత్ పేర్కొన్నా ఫోరెన్సిక్ విభాగమే శాస్త్రీయంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఇందుకోసం రోహిత్ నోట్ పుస్తకాలలోని రాతను లేఖతో కలిపి ఎఫ్ఎస్ఎల్కు పంపాలని భావిస్తున్నారు. కొట్టివేతల్లో విద్యార్థి సంఘాల వైఖరిపై రాతలున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడి ఆత్మహత్యపై అనుమానాలున్నాయని రోహిత్ తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లేఖలో కొట్టివేతల్ని విశ్లేషిస్తే ఆత్మహత్యకు కారణాలపై కీలక ఆధారాలు లభించవచ్చనే భావన వ్యక్తమవుతోంది.