ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరు? ప్రధానికి చెడ్డ పేరు తెచ్చేందుకే: కాంగ్రెస్పై వెంకయ్య ఫైర్
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఆరోపణలు చేసేముందు ఆలోచించుకోవాలని... అలా చేయనందుకే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి చెడ్డపేరు తేవాలన్న యోచనతోనే కాంగ్రెస్ పార్టీ అర్థంలేని ఆరోపణలు చేస్తోందన్నారు.
నేషనల్ కేసుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ప్రధానిని అవమానించేలా కాంగ్రెస్ చర్యలున్నాయని మండిపడ్డారు. గుజరాత్ సిఎంగా ఉన్న సమయంలో సిట్ ముందు ఎలాంటి హంగామా లేకుండా మోడీ హాజరయ్యారని, కాంగ్రెస్లా ర్యాలీలు తీయలేదని మండిపడ్డారు. ఆయన నిజాయితీని రుజువు చేసుకున్నారని చెప్పారు.
ప్రతిపక్షాలను వేధించిందెవరు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందెవరు? అని కాంగ్రెస్ పార్టీపై వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడ్ని జైల్లో పెట్టి పార్లమెంటు సమావేశాలను జరిపిందెవరని ఆయన నిలదీశారు.