వారెవ్వా.. ప్రారంభమే కాలేదు.. కరీంనగర్ రూపాయి పథకానికి ప్రశంసలు
Recommended Video
హైదరాబాద్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి.. ఓ పథకానికి సంబంధించి అలా నిర్ణయం తీసుకుందో లేదో ఇలా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యుల బాధను పంచుకునేలా తెరపైకి తెచ్చిన రూపాయికే అంత్యక్రియల స్కీమ్ శభాష్ అనిపించుకుంటోంది. జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నయా స్కీమ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఆకర్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మెచ్చుకున్నారు.
ఎస్పీవై రెడ్డి, వైఎస్ఆర్.. అదే కోవలో రవీందర్ సింగ్.. కరీంనగర్లో రూపాయికే అంత్యక్రియలు
దేశంలోనే తొలిసారి
కుటుంబ సభ్యులను కోల్పోయి బాధలో ఉండే వారికి భారం తగ్గించేలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి సరికొత్త పథకాన్ని అమలు చేయనుంది. అంతిమ యాత్ర - ఆఖరి సఫర్ పేరుతో నిర్వహించే రూపాయికే అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రశంసలు అందుకుంటోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి కరీంనగర్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టనున్నారు. స్థానికంగా ఎవరూ చనిపోయినా సరే.. కేవలం రూపాయి చెల్లిస్తే చాలు.. వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపడతామంటున్నారు మేయర్ రవీందర్ సింగ్. జూన్ 15వ తేదీ నాటికి అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ స్కీమ్ సవ్యంగా, సాఫీగా నడవటానికి దాతల సాయం తీసుకుంటామని చెప్పారు. నగర పాలక కమిషనర్ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తామన్నారు.
ప్రశంసల వెల్లువ
కరీంనగర్లో త్వరలో ప్రారంభం కానున్న రూపాయికే అంత్యక్రియల కార్యక్రమం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఆకర్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతిమ యాత్ర - ఆఖరి సఫర్ పథకం వివరాలను తెలుసుకున్న వెంకయ్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలికి అభినందనలు తెలిపారు. పేద, ధనిక బేధం లేకుండా, కులమతాల ప్రస్తావన లేకుండా ఇంత గొప్ప స్కీమ్ అమలు చేయాలనుకోవడం భేష్ అంటూ కితాబిచ్చారు.
కీపిట్ అప్.. కేటీఆర్ ట్వీట్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి తీసుకున్న రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రశంసించారు. ఆ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మేయర్కు, కార్పొరేటర్లకు, స్థానిక ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. మానవత్వ దృక్పథంతో కేవలం రూపాయికే అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడం పేద ప్రజలకు ఊరట కలిగించే అంశమని అభిప్రాయపడ్డారు.
కేటీఆర్ ట్వీట్పై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పథకం అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రీట్వీట్ చేశారు.