హీరోహీరోయిన్లు గోకినా, తాకినా, పీకినా శృంగార రసం లేదు: వెంకయ్య
హైదరాబాద్: ఒకప్పుడు సినిమాలో హీరోహీరోయిన్లు ఒకరినొకరు తాకకుండానే ముఖకవళికలతో ప్రేమభావాన్ని పలికించేవారని, మరి ఇప్పుడేమో ఒకరినొకరు తాకినా, పీకినా, గోకినా శృంగార రసాన్ని పలికించలేకపోతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
ఈరోజుల్లో ప్రచారం, ఆర్భాటం తప్ప సినిమాలో సరుకు ఉండటం లేదన్నారు. సంగీతం, సాహిత్యం స్థానంలో వాయిద్యం ఎక్కువైందన్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు జరిగింది.
ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి సినీ పరిశ్రమ ప్రముఖులు, నటీనటులు, ఫిలిం ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు తదితరులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల యజమాని రామోజీ రావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. భారతీయ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమకు మార్గదర్శకత్వం వహిస్తుందని, ప్రపంచస్థాయికి ఎదిగే సత్తా దానికి ఉందన్నారు. భారతీయ సినీ పరిశ్రమ విలువ 2014లో రూ.126 బిలియన్లు ఉండేదని, అది 2019 నాటికి రూ.204 బిలియన్లు అవుతుందని ఫిక్కీ అంచనా వేసిందని తెలిపారు.
ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, వినోదం ఇవ్వాలని, మీరూ సంపాదించుకోండని విదేశీ ప్రతినిధులను వెంకయ్య కోరారు. భారత్కు గొప్ప సంస్కృతి, వారసత్వం ఉందన్నారు. ఎన్నో అంశాలలో భారత్ ప్రథమ స్థానంలో ఉందని, సినిమాల నిర్మాణంలోనూ అగ్రస్థానమేనన్నారు. సినిమాలు మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలన్నారు. అప్పట్లో సినిమాలు ఏడాది నడిచేవని, ఇప్పుడు వారం నడిస్తే గొప్ప అన్నారు.