కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు, బాబు అనుసరించాలి: వెంకయ్య ప్రశంసలు
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేగాక, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని ఆయన ఆదేశించారు.
కేసీఆర్కు అభినందనలు
కాగా, ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు ట్విట్టర్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలిపారు.
తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి..
ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరలో ఏపీ కూడా ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేస్తూ..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది.
వెంకయ్య సూచన మేరకేనా?
కాగా, ఉపరాష్ట్రపతిగా తొలిసారి వెంకయ్య హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్కు సూచించారు వెంకయ్య. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.