అవసరమైతే కేసీఆర్-బాబు మాట్లాడుకోవాలి, కేంద్రం, రాష్ట్రాలు రాజకీయాలు పక్కన పెట్టాలి: వెంకయ్య
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీలో స్పందించారు. ప్రగతి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇరువురు సీఎంలు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడులు కృషి చేయాలన్నారు.
Recommended Video
మరిన్ని తెలంగాణ ఆవిర్భావ వేడుకల వార్తలు చదవండి
అన్ని రాష్ట్రాల సహకారంతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా ప్రజల సంక్షేమం కోసం ఇద్దరూ అవసరమైనప్పుడు కలిసి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకుని వాటిని పరిష్కరిస్తారని, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సం అద్భుత చిత్రాలు చూడండి
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టాలి
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో సరైన అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కాగా, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. మరోవైపు, ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నవ నిర్మాణ దీక్ష జరుపుతుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంచన దీక్ష చేస్తోంది.
ఢిల్లీ వేడుకల్లో గవర్నర్
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణ్ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇదే కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు
తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం పది గంటలకు కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత పదిన్నర గంటలకు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ నాలుగేళ్ల పాలనపై మాట్లాడారు.
జాతీయ జెండా ఆవిష్కరణ
హక్కులు, ఆత్మగౌరవం కోసమే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. అసెంబ్లీలో జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మండలిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.