ఓ ప్రశ్న వేస్తా, ప్రతిదీ హైదరాబాద్ కాదు: కేవీపీకి వెంకయ్య ప్రశంస, పవన్కు కౌంటర్
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం విడిపోకుండా ఉండాలని గట్టిగా ప్రయత్నించింది ఒక్క కేవీపీనే అన్నారు. ఆయన ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఒక్క మాట పెట్టుంటే, ఇప్పుడీ రభస, రాద్ధాంతాలకు అవకాశం ఉండేది కాదన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నారు. విభజన బిల్లుకు ఆమోదం పలికే సమయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తాను మాట్లాడుతుంటే తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు.
చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్
ఒక్క కేవీపీ మాత్రమే తాను విభజనకు వ్యతిరేకమని మొదటి నుంచి వాదిస్తూ వచ్చారన్నారు. మిగతా ఎంపీలంతా ఏదో ఒక దశలో రాష్ట్రం రెండుముక్కలైతేనే మంచిదని వ్యాఖ్యానించిన వారేనన్నారు. విడిపోతే నీటి విషయంలో తగాదాలు వస్తాయని తాను ముందే ఊహించానని చెప్పారు.
వివాదాలకు ఆస్కారం లేకుండా పాత ఒప్పందాలను గౌరవించాలన్న పదాన్ని చట్టంలో చేర్పించానని వెంకయ్య గుర్తు చేశారు. విభజన చట్టంలో కాంగ్రెస్ వాడిన పలు పదాలు కూడా సమస్యలను పెంచాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో ఏపీకి నష్టాన్ని తగ్గించాలనేదే మా ప్రయత్నం అన్నారు.
పవన్ కళ్యాణ్కు కౌంటర్
తాము నాడు విభజన చట్టాన్ని సమర్థిస్తూ ఏపీకి నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తున్నా, ఆరాటపడుతున్న యోధులు అప్పుడు ఎక్కడున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆయన పవన్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
కాకినాడ ఒక ఓటు, రెండు సీట్లపై పవన్ ప్రశ్నించారు. దీనిపైనా వెంకయ్య కౌంటర్ ఇచ్చారు. బిజెపి మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోవాలనే చెప్పిందని, హైదరాబాద్ తెలంగాణకు దక్కాలని, ఏపీకి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమన్నారు.
చంద్రబాబు సంగతేంటి?: పవన్, కేటీఆర్కు ధీటైన కౌంటర్
పార్టీ విధానానికి తగ్గట్టుగానే తాము నడిచామన్నారు. అది రాజకీయ వ్యూహమేనని, అవకాశవాద రాజకీయం అనడం తప్పన్నారు. అందులో రాజకీయ అవసరాలు లేవని, దాని గురించి తెలియని వాళ్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు.
కొంతమంది అతిగా మాట్లాడుతున్నారు
కొంతమంది చాలా అతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కావాల్సింది ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక శ్రద్ధ అన్నారు. హోదాతో ఏదో జరిగిపోతుందని కొంతమంది భ్రమలు కల్పిస్తున్నారన్నారు. హోదాతో విద్యా, వైద్య సంస్థలు రావన్నారు. దీనిని ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. కొంతమంది కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
ఓ ప్రశ్న అడుగుతా
తాను ఓ ప్రశ్న అడుగుతానని, ఈ ప్రశ్నపై వీధి వీధుల్లో, సందు గొందుల్లో ప్రజలు చర్చించాలని సమాధానం కోసం కాంగ్రెస్ను నిలదీయాలన్నారు. నేడ హోదా అంటూ అరచి అల్లరి చేస్తున్న వారు నాడు విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నానన్నారు.
విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయన్నారు. హోదాతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే ప్రత్యేక హోదాతో ప్రతి ఊరు హైదరాబాద్ అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విదేశీ రుణం తీసుకొని రాష్డట్రానికి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 14వ ఆర్థిక సంఘం సూచనతో హోదా రాదన్నారు. ఏపీకి లక్షా 93వేల ఇళ్లు ఇచ్చామన్నారు. పోలవరం ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు.