తెలంగాణపై మాట్లాడేందుకు భయంలేదు: వెంకయ్య, మనుషులే కాదు
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అన్నింటిని తాము నెరవేరుస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం చెప్పారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్కు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెప్పారు. ఏపీలో ఉండి తెలంగాణ గురించి మాట్లాడుతానని, తెలంగాణలో ఉండి ఏపీ గురించి మాట్లాడుతానని, మాట్లాడవద్దనే భయం తనకు లేదన్నారు. ఎందుకంటే అందరూ తెలుగువారే అన్నారు.
తెలంగాణకు, ఏపీకి, ఇతర రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయని, అవి కాంగ్రెస్ పార్టీ పాపమే అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేసిందనే విషయం కొద్ది రోజుల్లో ప్రజల ముందు పెడతామన్నారు. తాడేపల్లిగూడెంలో నిట్ రావడానికి మంత్రి మాణిక్యాల రావు కారణమని కితాబిచ్చారు. ఆయన దీని కోసం ఒత్తిడి తెచ్చారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత గల నేత, శక్తిసామర్థ్యాలు, క్రమశిక్షణ ఉన్న నాయకుడు అన్నారు. ఏపీలో చంద్రబాబు ఎన్నిక గర్వకారణమన్నారు. క్లిష్ట సమయాల్లో ఆయనకు సవాళ్లను ఎదుర్కోగలిగే శక్తి ఉందన్నారు.
చంద్రబాబుకు కేంద్రం సహకారం ఉంటుందని చెప్పారు. ప్రజలు కూడా విశాలంగా ఆలోచించాలని, తప్పుడు ప్రచారాలకు లోను కావొద్దన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని తప్పకుండా నెరవేర్చుతామని చెప్పారు. ప్రత్యేక హోదా పైన చర్చ సాగుతోందని చెప్పారు.
తెలుగును మర్చిపోవద్దు
ఈ మధ్య నేను పేపర్లో చదివానని, ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలని చూశానని, కానీ అది సరికాదన్నారు. తెలుగును మనం మర్చిపోవద్దన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మర్చిపోవద్దన్నారు. అలా మర్చిపోతే మానవడే కాదన్నారు.
తెలుగు మీడియంను ఉంచుకోవాలని, అలాంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలన్నారు. అయితే, ఇంగ్లీష్ వద్దని కాదని, ఇంగ్లీష్ నేర్చుకుంటూనే తెలుగును మర్చిపోవద్దన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు.