మరో కోణం: రూ.200 కోట్ల వెంచర్ వెనుక నయీం, ఎండీతో లింక్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ శివారులోని ఓ వెంచర్ వెనుక నయీం హస్తం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వెంచర్ విలువ రూ.200 కోట్లు. దీని వెనుక నయీం ఉన్నట్లుగా తాజాగా ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్)కు ఫిర్యాదు అందింది.
రూ.200 కోట్ల విలువైన ఈ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్కడి దేవతల గుట్టమీద ఉన్న దేవాలయాన్ని కూల్చివేశారని స్థానికులు కొన్నాళ్ల క్రితం ఆందోళనలకు దిగారు. తిరిగి ఆలయం నిర్మించాలంటూ వారు ఉద్యమిస్తున్నారు.
అమ్మాయిలతో నయీం అక్కడా జల్సా, ఆమెపై మనసుపడ్డ రిటైర్డ్ అధికారి!
ఈ విషయమై స్థానికులకు అండగా ఉన్న బీజేపీ నేత ఒకరిని నయీం అనుచరులు గతంలో బెదిరించారు. ఈ సంఘటన పైన ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలంటూ పహడీషరీఫ్ పోలీసులను ఆదేశించారు.
సదరు వెంచర్ యజమానులు తాము నయీంకు ప్రధాన అనుచరులుగా చెబుతూ అందరినీ బెదిరించేవారని తెలుస్తోంది. ఆ యజమాని కూడా బెదిరింపులకు పాల్పడేవాడని అంటున్నారు. అతనికి కూడా మాఫియాతో లింకులు ఉన్నాయని, బంగారం స్మగ్లింగ్ చేసేవాడని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.