కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన వేణుమాధవ్
కోదాడ: ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన తన మద్దతుదారులతో వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
తన స్వస్థలం కోదాడ అని, కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని వేణుమాధవ్ చెప్పారు. మూడు రోజుల క్రితం ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చారు. కానీ పత్రాలు సరిగా లేకపోవడంతో వాటిని అధికారులు తిరస్కరించారు. ఈ రోజు మళ్లీ నామినేషన్ వేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
సుహాసినిని గెలిపించండి: లోకేష్, జూ.ఎన్టీఆర్ వస్తారా అని అడిగితే.. బాలకృష్ణ ఏం చెప్పారంటే?
కాగా, శుక్రవారం వేణు మాధవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. వేణుమాధవ్ అధికారులకు నామినేషన్ పత్రాలు ఇచ్చారు. అయితే ఆ పత్రాలను చూసిన రిటర్నింగ్ అధికారులు సరిగా లేవని చెప్పి, తిరస్కరించారు. దీంతో వేణుమాధవ్ నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
తన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై వేణుమాధవ్ అప్పుడే స్పందించారు. తాను నామినేషన్కు అవసరమైన పత్రాలను పూర్తిస్థాయిలో సేకరించిన తర్వాత రెండ్రోజుల్లో మళ్లీ వేస్తానని స్పష్టం చేశారు. ఇతని స్వస్థలం కోదాడ. కాబట్టి ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు వేణుమాధవ్ ఉత్సాహం కనబరిచారు. కోదాడ నుంచి కూటమి తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, తెరాస తరఫున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.