ఏపీ అసెంబ్లీ సెక్షన్ 8 తీర్మానంపై టి ఆగ్రహం, మేం వెనక ఉంటాం: హోదాపై కెవిపి
న్యూఢిల్లీ: హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాలని ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి గురువారం అన్నారు. ఇరవై నెలలుగా హైదరాబాదులో ఎలాంటి సంఘటనలు జరగలేదన్నారు. ఇలాంటప్పుడు సెక్షన్ 8 అనడం విడ్డూరమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను దృష్టి మళ్లించేందుకే ఇలా సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారని వేణుగోపాల చారి విమర్శించారు. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రాలతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పారు.
ప్రధాని మోడీపై కెవిపి, జెడి శీలం ఆగ్రహం
ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాడినా తాము వెనుక ఉండి మద్దతు ప్రకటిస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు జేడీ శీలం, కెవిపి రామచంద్ర రావు గురువారం నాడు ఢిల్లీలో చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రం పరిస్థితి దుర్భరంగా ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తమకు కనీసం అపాయింటుమెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదాను మోడీ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కోటి సంతకాలు, మట్టి - నీరును తాము ప్రధాని మోడీకి పోస్టు చేస్తామని చెప్పారు.