‘అమరావతిలో హైకోర్టుకు భూమి దొరకడంలేదా?’: కొనసాగుతున్న ఆందోళనలు
న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టుకు భూమి దొరకడం లేదా? అని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ. 42 వేల కోట్లేనని, అయితే రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఖమ్మంలో అభ్యర్థిని పోటీ పెట్టేందుకు దిక్కులేని బీజేపీ.. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పడం విడ్డూరమని విమర్శించారు.
హైకోర్టు విభజనపై న్యాయవాదుల ఆగ్రహం
హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు కోసం, న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణవారికి అవకాశం కల్పించాలని కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు తెలంగాణ న్యాయవాదులు. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజన, ఏపీ న్యాయమూర్తుల తెలంగాణ ఐచ్ఛికాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లతో చేపట్టిన విధుల బహిష్కరణ అంశంపై న్యాయవాదులు వాడివేడిగా చర్చించారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల భవనంలో అధ్యక్షుడు కొత్త జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏపీకి చెందిన జడ్జీలు పని చేసే కోర్టులను మాత్రమే బహిష్కరించాలని, తెలంగాణకు చెందిన జడ్జీలు, న్యాయశాఖ సిబ్బంది ఎందుకు ఉద్యమం చేయడం లేదని ప్రశ్నించారు. వారు కూడా విధులు బహిష్కరించాలని పేర్కొన్నారు. హైకోర్టులో విధుల బహిష్కరణలను ఎక్కువ మంది వ్యతిరేకించారు.
ఈ అభిప్రాయాలపై కార్యవర్గంలో చర్చించి సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని, శనివారం వరకు యథావిధిగా విధుల బహిష్కరణ కొనసాగుతుందని అధ్యక్షుడు తెలిపారు.