పారికర్తో వేణుగోపాల్, 'వెంకయ్య కొడుకు షోరూంలో కార్లు కొన్న కెసిఆర్!'
మహబూబ్ నగర్/న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ను గురువారం నాడు కలిశారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అంశంపై పారికర్తో చర్చించారు.
కాంగ్రెస్, టిడిపి తప్ప ప్రజలంతా సంతోషం: కొప్పుల
ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనుల పట్ల కాంగ్రెస్, టీడీపీ నేతలు తప్ప ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని టిఆర్ఎస్ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ హైదరాబాదులో అన్నారు. ప్రతీది కూడా ప్రజలకు అనుకూలంగా జరుగుతోందని అందరూ భావిస్తుంటే జానారెడ్డి లాంటి వారు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
కొన్ని విషయాలపై తాము ప్రశ్నిస్తే కాంగ్రెస్ వద్ద సమాధానాలే లేవన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, టిడిపిలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు. జానాలాంటి సీనియర్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాము అధికారంలోకి వచ్చి 15 నెలలే అయిందన్నారు. అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలో సీఎం కేసీఆర్కు తెలుసునని చెప్పారు.
'ఆంధ్రావారిని విమర్శిస్తే కడుపు నిండదు'
రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర వారిని విమర్శిస్తే తెలంగాణ ప్రజల కడుపు నిండదని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రోజూ ఆంధ్ర వారిని తిడతారని, అదే సమయంలో కాంట్రాక్టులను కూడా ఆంధ్ర వారికే కట్టబెడతారని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన కార్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమారుడి షోరూమ్లో కొన్నవే అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. యాదగిరి గుట్ట డిజైన్ ఇచ్చింది కూడా ఆంధ్రకు చెందిన వ్యక్తే అన్నారు.
ప్రతి పనిని ఆంధ్ర వారితోనే కలసి చేస్తున్న కేసీఆర్ హైకోర్టు విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డొస్తున్నారని ఎలా ఆరోపిస్తారన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామాన్ని చూస్తే కేసీఆర్ పద్నాలుగు నెలల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు.