Disha Murder case: వెటర్నరి డాక్టర్ దిశ అస్తికల నిమజ్జనం: బరువెక్కిన గుండెతో..కృష్ణానదిలో..!
గద్వాల: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో కన్నుమూసిన వెటర్నరి డాక్టర్ దిశ అస్తికలను ఆమె కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో దిశ తండ్రి శాస్త్రోక్తంగా దిశ అస్తికలను నిమజ్జనం చేశారు. శంషాబాద్ నుంచి ఈ మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఆయన ఆయన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు బీచుపల్లికి చేరుకున్నారు.
కృష్ణానది ఒడ్డున శాస్త్రోక్తంగా కర్మకాండలను నిర్వహించారు. అనంతరం- ఓ తెప్పలో డాక్టర్ దిశ అస్తికలను ఉంచిన కలశాన్ని తీసుకెళ్లారు. నది మధ్యలో అస్తికలను నిమజ్జనం చేశారు. అస్తికల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నంత సేపూ ఆమె తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే కనిపించారు. బాధాతప్త హృదయంతో అస్తికలను నిమజ్జనం చేశారు. సుమారు గంటన్నర పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.
అనంతరం ఆయన నదీ ఒడ్డున తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తాను పడుతున్న వేదన ఏ తండ్రికీ కలగకూడదంటూ ఆయన విలపించారు. తన బాధతను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. కుమార్తె దిశ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బీచుపల్లి ఆంజనేయ స్వామిని, అలంపురం జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవాలని కొద్దిరోజుల కిందటే భావించామని, ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా- దిశ హత్యకు పాల్పడిన మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వారిపై విచారణ కొనసాగుతోంది. విచారణ సందర్భంగా వారిని హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారు. ఈ నలుగురిని బహిరంగంగా ఉరి తీయాలంటూ దేశ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాడివేడిగా చర్చ కొనసాగింది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, ఈ కేసును వీలైనంత త్వరగా ముగించేయాలని, దోషులకు మరణశిక్ష విధించేలా చర్యలు చేపట్టాలని లోక్ సభ, రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు. అవసరమైతే చట్టాలను సైతం మార్చాలన్న డిమాండ్ ను వారు వినిపించారు. దిశ హత్యోదంతం అనంతరం పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. మహిళల కోసం ప్రత్యేక రక్షణను కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాయి.