దిశ కేసులో కొత్త కోణం: పోలీసులు సైతం నివ్వెరపోయేలా: తొమ్మిది హత్యలు: రెండు రాష్ట్రాల్లో..!
Recommended Video
హైదరాబాద్: దేశం మొత్తాన్నీ అట్టుడికించిన వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నలుగురు కామాంధులకు సంబంధించిన భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలు పోలీసులను సైతం ఉలిక్కి పడేలా, నివ్వెర పోయేలా చేసింది. దిశపై హత్యోదంతానికి ముందే తొమ్మిది మంది మహిళలను అత్యంత కిరాతకంగా మట్టుబెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో యథేచ్ఛగా తమ అత్యాచారా పర్వాన్ని కొనసాగించారని అంటున్నారు.
దిశ హత్యోదంతానికి ముందు తొమ్మిది..
అంతకుముందు ఈ నలుగురు తెలంగాణ, కర్ణాటకల్లో తొమ్మిది మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. పోలీసులు అదుపులో తీసుకున్న సమయంలో వారు చేపట్టిన దర్యాప్తు సందర్భంగా నలుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. దిశ తరహాలోనే అత్యాచారం చేసి, హతమార్చినట్లు వారు తెలిపారని అంటున్నారు. ఇందులో మహ్మద్ ఆరిఫ్ పాషా, ఆరు, చెన్నకేశవులు మూడు హత్యలు చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల్లో..
ఈ హత్యలన్నీ తెలంగాణలోని మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయని తేలినట్లు చెబుతున్నారు. కర్ణాటకలో కూడా రెండు హత్యలు చేసినట్లు నిందితులు అంగీకరించారని అంటున్నారు. నిందితులు నలుగురూ లారీడ్రైవర్లు, క్లీనర్లు కావడం వల్ల ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకునే వారని, జాతీయ రహదారులపై ఒంటరిగా కనిపించిన మహిళలను చెరబట్టి, హత్య చేసే వారని సమాచారం.
అత్యాచారం.. హత్య..మృతదేహం కాల్చివేత
అన్ని కేసుల్లోనూ మోడస్ ఒపరాండి ఒకే తరహాలో కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. మహిళలపై అత్యాచారం చేసి, హతమార్చడం, ఆ తరువాత మృతదేహాన్ని గుర్తు పట్టనివిధంగా పెట్రోలు పోసి తగుల బెట్టడం వంటి చర్యలకు పాల్పడే వారని అంటున్నారు. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు త్వరలో నమోదు చేయబోయే చార్జిషీట్లో ఈ అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వివరాలను పొందుపరుస్తారని అంటున్నారు.
కొద్దిరోజులకే ఎన్ కౌంటర్..
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద కిందటి నెల 27వ తేదీన వెటర్నరి డాక్టర్ దిశపై మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిరోజుల్లోనే సైబరాబాద్ పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. వెటర్నరి డాక్టర్ దిశ మృతదేహం లభించిన షాద్ నగర్ చటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్ద సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా.. వారు తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.