మొద్దు శ్రీను సెల్లో దిశ నిందితులు : తొలిరోజే మటన్తో భోజనం: కానరాని పశ్చాత్తాపం!
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన వెటర్నరీ డాక్టర్ హత్యకు కారణమైన నలుగురు నిందితులు చర్లపల్లి జైళ్లో ఉన్నారు. 14 రోజుల రిమాండ్ లో భాగంగా వారిని అక్కడ వేర్వేరు చీకటి కొట్లలో (సింగిల్ సెల్స్) ల్లో బందీలుగా ఉంచారు. అయితే, వారు చేసిన దుర్మార్గం మీద దేశం మొత్తం ఆగ్రహంతో రగిలి పోతున్నా..వారిలో మాత్రం పశ్చత్తాపం కనిపించటం లేదు. ఆ నలుగురు జైళ్లోకి వస్తున్న సమయంలోనే అక్కడే ఉన్న ఖైదీలు తిట్ల దండకం మొదలు పెట్టారు.
వారి పైన నిఘా కోసం మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించారు. వారు రాత్రంతా నిద్ర పోకుండా గడిపినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు నిందితులకు జైల్లో మటన్ తో కూడిన భోజనం అందించారు. తోటి ఖైదీలను కలిసే అవకాశాల్లేకుండా చర్యలు తీసుకున్నారు.అయితే, పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న మొద్దు శీనును ఉంచిన గదినే ఇప్పుడు ఈ నలుగురి కి జైలు సిబ్బంది కేటాయించారు.
నాడు మొద్దు శ్రీను ఉన్న సెల్స్ లోనే..
చర్లపల్లి జైల్లో ప్రమాదకరంగా ఉండే ఖైదీలకు ఈ చీకటి కొట్లను కేటాయిస్తారు. తోటి ఖైదీల నుండి హాని ఉన్న ఖైదీలను సైతం ఈ చీకటి కొట్లలోనే ఉంచుతారు. పశువైద్యాధికారిపై పైశాచికత్వం ప్రదర్శించిన నలుగురు నిందితులను ఈ కారణంతోనే సింగిల్సెల్కు మార్చారు. సాధారణంగా ఉండే జైలు కంటే ఇవి భిన్నంగా ఉంటాయి.
వీటిలో ముందు వైపు తలుపునకు కటకటాలు, వెనక వైపు దాదాపు 13 అడుగుల ఎత్తులోఒక వెంటిలేటర్ మాత్రమే ఉంటాయి. అందులోనే ఒక మూల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా గోడచాటుగా ఉండే బాత్రూం మాత్రమే ఉంటుంది. జైలులోని ఇతర విషయాలేవీ వీరికి తెలిసే అవకాశం ఉండదు. సమయానికి టిఫిన్, టీ, భోజనం మాత్రం అందిస్తారు. చీకటి కొట్టులాంటి సింగిల్ సెల్లోని ఖైదీలు ఎలాంటి అఘాయిత్యానికి, ఆత్మహత్యా యత్నానికి పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. స్పూను, గ్లాసు, ప్లేటు లాంటివే కాకుండా బాత్రూంలో కనీసం బకెట్ కూడా ఉండకుండా చూస్తారు. కారిడార్లో ఉండే విద్యుత్ దీపమే వారికి రాత్రి వేళ గుడ్డి వెలుగునిస్తుంది. ప్రస్తుతం నిందితులు ఉన్న మహానది బ్యారక్లోని సింగిల్సెల్స్లోనే గతంలో మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకాష్ ను ఉంచారు.
మటన్ తో నిందితులకు భోజనం..
నలుగురు నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో..దిశా పైన క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం..హత్య చేసిన నలుగురు నిందితులను శనివారం సాయంత్రం చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు. నిందితులుగా ఉన్న అరీఫ్, చెన్నకేశవులు, నవీన్, శివను జైళ్లోకి తెస్తున్న సమయంలోనే తోటి ఖైదీలు..జైలు సిబ్బంది వారి మీద తమ ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తమ దూషణల ద్వారా తెలియ చేసారు. ఇక, వారికి ఆదివారం ఉదయం జైలు సిబ్బంది అల్పహారం గా పులిహోర అందచేసారు. జైలు నిబంధనల ప్రకారం మధ్నాహ్న భోజనం లో 250 గ్రాముల ఆహారాన్ని అందించారు. ఇక, ఆదివారం నాడు సాధారణంగా ఖైదీలకు మాంసాహారాన్ని అందిస్తారు. అందులో భాగంగా ఆ నలుగురు సైతం మటన్ తో రాత్రి భోజనం చేసారు. కానీ, అదే సమయంలో నిం.దులకు ఉరే సరి అంటూ చర్లపల్లి జైలు వద్ద యువత, మహిళలు ఆందోళనలు నిర్వహించారు.
కనపడని పశ్చాత్తాపం..
తాము చేసిన దుర్మార్గం పైన ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవతున్నా..చివరకు కన్నవారు సైతం వారికి శిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నా..ఆ నలుగురి లో మాత్రం ఎక్కడా పశ్చత్తాపం కనడపటం లేదని జైలు సిబ్బంది చెబుతున్నారు. వారు మమాలుగానే కనిపిస్తున్నారని..ఎక్కడా తప్పు చేసామనే బాధ వారిలో కనిపించటం లేదంటున్నారు. అయితే, నలుగురు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులుకు మూత్ర పిండాల సమస్య ఉన్నట్లు జైలు వైద్యులు నిర్ధారించారు. చెన్న కేశవులకు ఆరు నెలలకోసారి డయాలసిస్ అవసరం. గతంలో నిమ్స్లో చికిత్స పొందాడు. నిమ్స్ వైద్యులను సంప్రదించి వైద్యం అందజేస్తామని అతడిని పరీక్షించిన అనంతరం జైలు అధికారులు స్పష్టం చేసారు. మిగిలిన ముగ్గురు ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు.