కాంగ్రెస్ నేతలపై వీహెచ్ కస్సుబుస్సు.. పార్టీ మారతానని సంకేతాలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైరయ్యారు సీనియర్ నేత వీ హనుమంతరావు. వారి వైఖరి వల్లే పార్టీ ఈ పరిస్థితికి చేరిందని విమర్శించారు. పార్టీలో తనకు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతుందని వివరించారు. రాజీవ్ గాంధీ జయంతి తర్వాత తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని .. పార్టీ మార్పుపై మనసులోని మాటను బయటపెట్టారు.
టీ పీసీసీ నేతలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు వీహెచ్. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ నుంచి పోటీచేస్తానని చెప్పినా .. వినిపించుకోలేదన్నారు. తన పేరు లేకుండానే హైకమాండ్ వద్దకు తన పేరు పంపించారని విమర్శించారు. హైకమాండ్లో ఉన్న కొందరు నిజాయితీపరులకు ఇక్కడి నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఈ నెల 20న జరిగే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తన భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీనిపై కార్యకర్తలు, అభిమానులతో చర్చించి .. ఒక నిర్ణయానికి వస్తానని పార్టీ మార్పుపై సంకేతాల్చిచారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ .. పీసీసీ పెద్దలపై గుర్రుగా ఉన్నారు. తాను పార్టీని వీడబోనని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన .. ఎట్టకేలకు మనసులోని మాటను బయటపెట్టారు. కానీ రాజీవ్ జయంతి తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని .. అప్పటిలోపు కార్యకర్తలు, అభిమానులతో చర్చలు జరుపుతానని పేర్కొన్నారు. అయితే ఆయన పార్టీ వీడుతారా ? వీడితే ఏ పార్టీలో చేరతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.