అరే... నువ్వు ఎవడ్రా బై.. అరేయ్...: సిఐపై నోరు పారేసుకున్న విహెచ్
ఓ ఇన్స్పెక్టర్పై కాంగ్రెసు సీనియర్ నేత అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయన తిట్లకు ఇన్స్పెక్టర్ మనస్తాపానికి గురై పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.
హైదరాబాద్: ఓ పోలీసు ఇన్స్పెక్టర్పై కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు నోరు పారేసుకున్నారు. అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. "అరే.. నువ్వు ఎవడ్రా బై నాకు చెప్పేది!. నన్నే అడ్డుకుంటావా?. ఆరేయ్.. నీ అంతు చూస్తా" అంటూ తిట్టిపోశారు. డ్యూటీలో ఉన్న ఓ ఇన్స్పెక్టర్పై ఆయన విరుచుకుపడ్డారు.
సాక్షాత్తూ అసెంబ్లీ ఆవరణలో, మీడియా పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటన మర్నాడు గానీ వెలుగులోకి రాలేదు. మీడియాతో మాట్లాడేందుకు పాయింట్ వద్దకు వీహెచ్ వచ్చారు. అందుకు అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న కామాటిపుర అదనపు ఇన్స్పెక్టర్ పాములపర్తి సుధాకర్ అడ్డుకున్నారు. దాంతో వీహెచ్ విశ్వరూపం ప్రదర్శించారు.
మీడియా పాయింట్ వద్ద ప్రస్తుత సభ్యులే మాట్లాడాలని, మాజీలకు అవకాశం లేదని, అందువల్ల వెళ్లిపోవాలని సుధాకర్ మర్యాదపూర్వకంగా చెప్పినా వీహెచ్ వినిపించుకోలేదు. 'మేం మాట్లాడానికి కూడా మీ అనుమతి తీసుకోవాలా?. ఇదేనా ప్రజాస్వామ్యం?.' అంటూ మండిపడ్డారు.
తిట్ల వర్షంతో మనస్తాపం చెందిన సుధాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత తన వేదనను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. "దళితుడిని అయినందుకే వీహెచ్ నన్ను దూషించారు. అసభ్యకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందాను. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా. కానీ, ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను" అని పోస్టు చేశారు.
ఇరవై ఏళ్ల సర్వీసులో ఎలాంటి ఆరోపణలు లేకుండా విధులు నిర్వహించానని, ఎప్పుడూ ఇలాంటి అవమానం జరుగలేదని అన్నారు. డ్యూటీలో ఉన్న తనను దూషించిన వీహెచ్పై శుక్రవారం సైఫాబాద్ పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ సుధాకర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఐపీసీ 353, 294-బి, 504 సెక్షన్ల కింద వీహెచ్పై కేసు నమోదు చేశారు.