రైతులు పట్టడం లేదు: కెసిఆఆర్పై విహెచ్ ఫైర్, చేనుబాట పట్టాలని నాగం
నిజామాబాద్/ హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు. కాంగ్రెస్లో పదవులు పొంది కోట్లు సంపాదించిన వారు పార్టీని వదిలివెళ్తున్నారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ బోర్గాం దగ్గర కాంగ్రెస్ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సభలో వీహెచ్ మాట్టాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సభకు అనుమతిలేదంటూ వీహెచ్, పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలావుంటే, తెలంగాణలో కరువు తాండవిస్తున్నా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని బిజెపి నేత నాగం జనార్దన్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలపై కేబినెట్లో చర్చించకపోవడం దారుణమని విమర్శించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 1007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వారి వివరాలు వెబ్సైట్లో పెడుతున్నామని నాగం తెలియజేశారు. కేసీఆర్ చైనా పర్యటన మానుకుని చేనుబాట పట్టాలని ఆయన హితవుపలికారు. రైతులకు కరువు పెన్షన్ ఇవ్వాలని నాగం జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఉద్యమం అయిపోయిందని, లూటీ మొదలైందని మరో బిజెపి నేత యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అస్థవ్యస్థ పాలన ఆరంభమైందన్నారు. త్వరలోనే ప్రభుత్వ అవినీతి బట్టబయలు అవుతుందని యెన్నం అన్నారు. మిషన్ కాకతీయలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.