ఆయన్నెవరు రాయమన్నారు: జైరాంపై విహెచ్ నిప్పులు
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై పుస్తకం రాసిన తమ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్పై కాంగ్రెసు తెలంగాణ నాయకుడు వి. హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై జైరాం రమేష్ రాసిన ఆ పుస్తకంలోని విషయాలు అధికార బిజెపి, తెలుగుదేశం పార్టీలకు రాష్ట్ర విభజనపై కాంగ్రెసుపై ధ్వజమెత్తడానికి ఆయుధంగా మారిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజనపై జైరాం రమేష్ను ఎవరు పుస్తకం రాయమన్నారని ఆయన అడిగారు. జైరాం రమేష్పై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెసు పార్టీ మంగళవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఒకేసారి రైతు రుణాలు మాఫీ చేయకుండా విడతలవారీగా చేస్తూ అన్నదాతలను కెసిఆర్ మోసం చేశారని కాంగ్రెసు నాయకురాలు డికె అరుణ విమర్శించారు. ఇలాంటి హామీల వల్లనే కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చేదని అన్నారు.
ఈ బహిరంగ సభలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా వారు ధ్వజమెత్తారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రైతులను తెరాస మోసం చేసిందన్నారు. తెలంగాణలో రైతులు ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యారన్నారు. నీళ్లు, నిధులు అంటూ ఇచ్చిన హామీలు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం మూడో విడత రుణాలను అమలు చేయలేదన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు.