కేసీఆర్కు సగం తగ్గింది.. అది పూర్తిగా తగ్గాలి.. వెంకన్నకు వీహెచ్ మొక్కులు..!
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు. లోక్సభ ఫలితాలతో కేసీఆర్కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. 16 స్థానాల్లో గెలుస్తామంటూ విర్రవీగిన కేసీఆర్కు తగిన శాస్తి జరిగిందని.. దాంతో ఆయనకు అహంకారం సగం తగ్గిందని ఎద్దేవా చేశారు.
లోక్సభ ఫలితాల్లో ఎదురుదెబ్బ.. థర్డ్ ఫ్రంట్ కలలు ఆవిరేనా..! కేటీఆర్ వాట్ నెక్స్ట్
లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందని.. పదహారు స్థానాల్లో గెలుస్తామని లెక్కలేసుకున్నా కేవలం 9 స్థానాలకే పరిమితమైందన్నారు. కేసీఆర్కు సగం గర్వం తగ్గిందని.. ఆయనకు పూర్తిగా గర్వం తగ్గించాలని తిరుపతి వెంకన్నకు మొక్కుతున్నానని వ్యాఖ్యానించారు.
నల్గొండ జిల్లాలోని హాజీపూర్లో ముగ్గురు బాలికలను సైకో శీనుగాడు హత్యాచారాలు చేసి చంపితే ఇంతవరకు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కేసీఆర్ వెళ్లలేదని ఆయన తప్పుపట్టారు. అదే కార్యకర్త చనిపోతే బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పాడే మోసిందని గుర్తు చేశారు. మరి నీకు ఓట్లేసిన హాజీపూర్ ప్రజలకు నువ్వేమీ న్యాయం చేశావంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. వారంలోగా కేసీఆర్ హాజీపూర్కు వెళ్లి బాధితులను ఆదుకోవాలని, లేనిపక్షంలో తాను ఆ గ్రామానికి వెళ్లి దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం తలెత్తి 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కూడా కేసీఆర్కు ఎలాంటి బాధ లేదని వీహెచ్ ధ్వజమెత్తారు. నియంతలా పాలించడం కాదని ప్రజా సేవకుడిగా కేసీఆర్లో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.