కెసిఆర్కు ఆ విషయం తెలుసు: సోనియాను కలిసిన విహెచ్
న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తెలుసునని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. అయితే కాంగ్రెస్ త్యాగాన్ని ప్రజల్లోకి తాము సరిగ్గా తీసుకుని వెళ్లలేకపోయినట్లు ఆయన తెలిపారు.
టిఆర్ఎస్కు ప్రజాదరణ ఎక్కువకాలం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. శనివారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని వీహెచ్, కుటుంబసభ్యులు కలిసారు.
మూడుసార్లు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించినందుకు సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఏ పని అప్పగించినా బాధ్యతగా పూర్తిచేస్తానన్నారు. పూలే, అంబేడ్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.
2019లో తెలంగాణలో తాము కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తామని ఆయన చెప్పారు. ఓబిసి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని విహెచ్ చెప్పారు.