కేసీఆర్ హటావో, తెలంగాణ బచావో.. అప్పులకుప్పగా రాష్ట్రం, 30 నుంచి కార్యాచరణ: వీహెచ్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. త్వరలోనే కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో అంటారని తెలిపారు. ఈ నెల 30వ తేదీన తమ ప్రణాళికపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అమలుచేసిన భూ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వీహెచ్ నివాళులర్పించారు.
తిరగబడితేనే..
ప్రజలు తిరగబడితేనే కేసీఆర్ ప్రభుత్వం దారిలోకి వస్తుందని వీహెచ్ అన్నారు. లేదంటే నిరంకుశ విధానాలతో ముందుకెళ్తుందని దుమ్మెత్తిపోశారు. ఇకనైన అరాచక పాలనకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలో అన్ని విభాగాలను అణగదొక్కాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులను బెదిరించడం సరికాదన్నారు. విభాగాలను అణగదొక్కి పని చేయించుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఊలుకు, పలుకు లేదు
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కేసీఆర్ వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందన్నారు. 40 రోజులకుపైగా కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. ప్రజా రవాణా వ్యవస్థను గాలికొదిలేశారని మండిపడ్డారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. కార్మికులతో ప్రభుత్వం భేషజాలకు వెళ్లడంతో సమస్య తలెత్తిందని చెప్పారు.
అప్పులకుప్ప
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మిగులు బడ్జెట్తో ఉందని వీహెచ్ గుర్తుచేశారు. కానీ ఇవాళ 3 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఆ నగదు ఏయే విభాగాలకు కేటాయించారు.. ఆయా పనుల్లో పారదర్శకతపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రూ.3 లక్షల కోట్ల అప్పు అయినా.. కొన్ని విభాగాలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అవి ఎప్పటిలాగే నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు.
లెక్కచేయడం లేదు
కేసీఆర్ సర్కార్పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఫైరయ్యారు. విపక్షాలను, నేతలనే కాక కోర్టులను కూడా కేసీఆర్ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు, ప్రతిపక్షం, కోర్టులు అంటే గౌరవం లేదని మండిపడ్డారు. అందరినీ చిన్నచూపు చూస్తుందని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని హైకోర్టు సూచించినా.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందని తెలిపారు.