హాజీపూర్ ఘటన అంశాన్ని లేవనెత్తిన వీహెచ్ .. గవర్నర్ కు ఏమని ఫిర్యాదు చేశారంటే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోమారు హాజీపూర్ బాలికల రేప్ మరియు హత్య కేసులను తెరమీదకు తీసుకువచ్చారు. నేడు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ను కలిసిన విహెచ్ హాజీపూర్ ఘటన గురించి గవర్నర్ కు వివరించారు. శ్రీనివాస రావ్ అనే కామాంధుడు రేప్ చేసి బాలికలను చంపి బావులలో పూడ్చి పెట్టిన వైనాన్ని, ఇక ఆ కేసును పట్టించుకోని ప్రభుత్వ తీరును గవర్నర్ కు ఆయన వివరించారు.
గవర్నర్ ను కలిసిన అనంతరం వి హనుమంత రావు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆయన వెళ్లి మరీ పరామర్శిస్తారు. హాజీపూర్ బాధితులను మాత్రం పరామర్శించరా ?' అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై వి. హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపూర్ ఘటన గురించి గవర్నర్కు వివరించినట్లు తెలిపిన విహెచ్ తాను శుక్రవారం గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ వద్ద కొద్దిసేపు విలేకరులతో మాట్లాడిన ఆయన దీపావళి పండుగ తర్వాత తమ ఇంట్లో జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతానికి గవర్నర్ను ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సమయంలోనే హాజీపూర్ ఘటన మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటన ,ఆర్టీసీ సమ్మె, సమ్మె వల్ల నలుగురు ఉద్యోగులు మృత్యువాత పడిన ఘటనలు విన్నవించారు. హాజీపూర్ ఘటన నేపథ్యంలో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుపై ఇప్పటివరకూ చర్యలు లేవని విమర్శించారు. గవర్నర్ను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని కోరారు. ఇక కొత్త గవర్నర్ తమిళ సై వచ్చాక మాకు న్యాయం జరుగుతోందని ఆశ కలుగుతుందన్నారు వీ హనుమంతరావు.
తాను చెప్పిన అంశాల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని వీహెచ్ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ హాజీపూర్ ఘటన జరిగి ఇంత కాలం అవుతున్న విహెచ్ వద్ద ఈ ఘటన మర్చిపోలేదు. ఏకంగా గవర్నర్ కు విన్నవించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి చొరవ చూపాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హాజీపూర్ ఘటన మరొకసారి వార్తల్లోకి వచ్చింది.