మన్ కీ బాత్లో మోడీ చెప్పేవన్నీ అబద్దాలే: విహెచ్
హైదరాబాద్: ‘మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ అబద్దాలేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ఆరోపించారు. కార్పొరేట్ల కోసమే కొత్త భూసేకరణ చట్టం తీసుకువచ్చారని విమర్శించారు. సోమవారం మీడియా వద్ద ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. భూములన్నీ అమ్మేస్తే భవిష్యత్ తరాలు ఏం కావాలని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పారని, ఎన్డీయే ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదని వీహెచ్ ఆరోపించారు.
సంక్షేమ భవనాలను ఏ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంక్షేమ భవనాల నిర్మాణాలకు వివాదాల్లో లేని భూములను కేటాయించాలని ఆయన కోరారు.
ఆదర్శ రైతులను తొలగించడంపై వివరణ కోరితే మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. మరో ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ - తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ప్రభుత్వం మొక్కులు తీర్చుకోవాలని సూచించారు.
మంచికోసం పోరాడే వారికి ప్రజలు పట్టం కడతారని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి అన్నారు. అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. బీజేపీ టీడీపీ నడిపిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలపై కిషన్రెడ్డి ప్రశ్నించగలరా అని సవాల్ విసిరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని ఊదరగొట్టారని, దీనిపై ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.