టీపీసీసీ చీఫ్ వేరే పార్టీ నుండి వచ్చిన వారికి ఎలా ఇస్తారు ? కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ టీపీసీసీ చీఫ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా, కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి అంశంపై తనదైన స్టైల్ లో మాట్లాడారు. ఇక పీసీసీ చీఫ్ను మారుస్తారని ప్రచారం జరుగుతోన్న సమయంలో.. వేరే పార్టీ నుంచి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు వీ హనుమంతరావు .
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలో వుందని వస్తున్న వార్తల నేపధ్యంలో సోషల్ మీడియాలో ప్రచారంపై ఆయన స్పందించారు . పీసీసీ చీఫ్ పదవి తమదేనంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని అది మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడినవారికే పీసీసీ చీఫ్ ఇవ్వాలి.. కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వొద్దని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఒకవేళ రేవంత్ కి పార్టీ పగ్గాలు అప్పజేబితే కాంగ్రెస్ పార్టీని చాలామంది వీడిపోతారని వీహెచ్ అన్నారు.
పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, ఆయారాం గయారాం వంటి వ్యక్తులకు పార్టీలో కీలక పదవులు ఇస్తున్నారని ఆవేదన చేశారు. ఓడిపోయినవాళ్లకు కూడా ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నారని, నేతల బ్యాక్గ్రౌండ్ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీహెచ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారన్నది ఆయన మాటల్లోనే తెలిసిపోతోంది.
కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ చీఫ్గా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించబోతుందన్న ఊహాగానాలు కొంతకాలంగా ఊపందుకున్న నేపధ్యంలో తాజాగా కుటంబ సమేతంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడం వంటి అంశాలతో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ నియమిస్తారన్న ప్రచారం ఆయన అభిమానులను జోష్ లో ముంచుతున్నా కాంగ్రెస్లో ఆయనంటే గిట్టనివారికి మాత్రం మంట పుట్టిస్తోంది.మరి ఈ నేపథ్యంలో అధిష్టానం టీపీసీసీ చీఫ్ గా ఎవరికి బాధ్యతలు అప్పజెప్పుతుందో వేచి చూడాలి.