తప్పుకున్న విహెచ్: రాజ్యసభకు డిఎస్, లక్ష్మీకాంత రావు ఏకగ్రీవం
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేయాలనే ఆలోచనను కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు విరమించుకున్నారు. రాజ్యసభకు విహెచ్ను పోటీకి దించాలనే ఆలోచన చేసిన తెలంగాణ కాంగ్రెసు నాయకులు శనివారం సమావేశమై పోటీ చేయకూడదని నిర్ణయించింది.
విహెచ్ పోటీ చేసే ఆలోచనను విరమించుకోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి చెందిన ఇద్దరు అభ్యర్తులు డి. శ్రీనివాస్, లక్ష్మీకాంత రావు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గతంలో టిఆర్ఎస్లోకి వెళ్లిన కె. కేశవ రావు రాజ్యసభకు పోటీ చేస్తే తాము మద్దతు ఇచ్చామని, ఈసారి తమకు టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మద్దతు ఇస్తారని అనుకున్నామని విహెచ్ అన్నారు.
రాజ్యసభకు టిఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను పోటీకి దించడంతో తాను పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ ఫిరాయింపులు హేయమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత జానా రెడ్డి అనుకున్నారని ఆయన చెప్పారు.
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో ఓటమిపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాము నివేదిక ఇస్తామని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత చెప్పారు. జూన్ 2వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని సోనియాకు కృతజ్ఞతలు చెబుతూ నిర్వహిస్తామని కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు. జూన్ 2వ తేదీన అన్ని జిల్లాల్లో జెండాలు ఎగురవేస్తామని చెప్పారు.