కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు...వారి మనోభావాలు దెబ్బతిన్నాయట
హైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ హిందువులను ఉద్దేశిస్తూ'హిందూ గాళ్ళు-బొందు గాళ్ళు- దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది' అంటూ అవమానించారని రజత్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.
ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానం పై కూడా కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిందని వీహెచ్పీ నేతలు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లేలా కేసీఆర్ సభలో ప్రసంగించారని చెప్పిన వీహెచ్పీ నేతలు కేసీఆర్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కేసీఆర్ కరీంనగర్ సభలో ప్రసంగించిన సీడీని ఫిర్యాదులేఖతో పాటు జతచేసి ఈసీకి అందజేశారు. సీఎం కేసీఆర్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదని వీహెచ్పీ నేతలు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.
టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే: తెలంగాణలో కొనసాగుతున్న కారుజోరు...దక్షిణాదిలో పెరిగి బీజేపీ ఓటుశాతం
ఇక ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీహెచ్పీ బృందానికి రజత్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన వీహెచ్పీ బృందంలో రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ రామరాజుతో పాటు అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, భజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ ముఖేష్, సీనియర్ న్యాయవాది కరుణాసాగర్, వీహెచ్పీ జిల్లా కార్యదర్శి గిరిధర్, సభ్యులు ప్రశాంత్లు ఉన్నారు.