అడ్డదారుల్లో అందలం.. అడ్డగోలు రాజకీయాలు... కేసీఆర్పై రాములమ్మ నిప్పులు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విజయశాంతి. అడ్డదారుల్లో అందలం ఎక్కడం టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అడ్డగోలు రాజకీయ చేయడంలో కేసీఆర్ నేర్పరి అని మండిపడ్డారు. ఇప్పటివరకు చేసిన దుర్వినియోగం, అక్రమాలు సరిపోవని .. మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేయాలని సిద్ధమవుతుందని విమర్శించారు.
వార్డుల విభజన విషయంలో అవకతవకలకు సంబంధించి హైకోర్టు ప్రస్తావించిందని గుర్తుచేశారు. ఎన్నిల నిర్వహణలో ఎన్ని అవకతవకలు చేస్తాయో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ను రాష్ట్రపతి అడిగితే .. ప్రతిపక్షాల కుట్ర అని కేసీఆర్ గగ్గోలు పెట్టారని ప్రత్యేకంగా గుర్తుచేశారు. దీనిని బట్టి కేసీఆర్ రాష్ట్రపతిని కూడా వదలలేదని అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని చెబుతూ కేసీఆర్ .. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ప్రతిపక్షాలను ఓడించాలనుకోవడం కుట్ర కాదా అని విజయశాంతి ప్రశ్నించారు. దీనికి సంబంధించి హైకోర్టు జరిపే విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చి, టీఆర్ఎస్ ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు.