హరికృష్ణ పార్థీవ దేహానికి వెంకయ్య సహా ప్రముఖుల నివాళి: ఎవరెవరు ఏమన్నారంటే..?
Recommended Video
హైదరాబాద్: టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఉదయం మెహదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ముక్కుసూటి మనిషి..
అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. హరికృష్ణ నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారని అన్నారు. ఏ పనైనా చిత్తుశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి హరికృష్ణ అని వ్యాఖ్యానించారు. గతంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని గట్టిగా చెప్పారని..ఆనాటి ఛైర్మన్ అభ్యంతరం తెలిపితే తాను జోక్యం చేసుకుని తర్జుమా చేస్తానని చెప్పినట్లు వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.
మెండుగా ప్రజాభిమానం
హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉందని.. సినీ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. హరికృష్ణ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
సీటు బెల్టు పెట్టుకుంటే కట్టేసినట్లుంటుందని.. సుజనా భావోద్వేగం
టీడీపీ ఎంపీ సుజనా చౌదరి.. హరికృష్ణకు నివాళులర్పించారు. కాగా, ‘తాను డ్రైవింగ్ చేస్తున్న కారులో సీటు బెల్టు పెట్టుకుని ఉంటే హరికృష్ణ బతికేవారు' నిన్నటి నుంచి వినిపిస్తున్న ఈ మాటలపై ఎంపీ వైవీఎస్ చౌదరి స్పందించారు. హరికృష్ణతో 'సీతయ్య', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టారు. సీటు బెల్టును హరికృష్ణ పెట్టుకోలేదని ఇప్పుడు మాట్లాడటం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హరికృష్ణ చిన్నతనం నుంచే అన్ని రకాల వాహనాలనూ నడిపేవారని గుర్తు చేసిన ఆయన, అప్పటి వాహనాల్లో సీట్ బెల్ట్ ఉండేది కాదని, దీంతో ఆయనకు అలవాటు కాలేదని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకుంటే, తనను కట్టేసినట్టుగా అనిపిస్తుందని ఆయన చెప్పేవారని వైవీఎస్ చౌదరి అన్నారు. ఎవరికీ ప్రమాదాలు జరగాలని ఉండదని, హరికృష్ణను దేవుడు పిలిచాడని అభిప్రాయపడ్డారు.
ఎప్పుడూ చిన్న ప్రమాదం కాలేదు.. పోచారం
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యరథంపై హరికృష్ణ వేలాది కిలోమీటర్లు తిరిగారనీ, అయినా చిన్న ప్రమాదం కూడా జరగలేదని తెలిపారు. తిరుమలలో రోడ్ల నిర్మాణం కోసం హరికృష్ణ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షలను అందజేశారని వెల్లడించారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.