మిత్రుడ్ని నమ్మి వెళ్తే గ్యాంగ్ రేప్ చేసి ఆస్పత్రి వద్ద పడేసి వెళ్లారు
వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కామాంధుల దాహానికి ఓ గిరిజన యువతి బలైంది. పరిచయస్థుడిని నమ్మి వెళ్తే సామూహిక అత్యాచారం చేశారు. తానున్న చోటికి రమ్మని పిలిచిన మిత్రుడు ఆమెను బలి పశువును చేశాడు.
సామూహిక లైంగిక దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆ యువతి అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్తండాకు చెందిన ఇస్లావత్ బావుసింగ్, లక్ష్మి దంపతులకు నలుగురు కూతుళ్లు. ముగ్గురికి పెళ్లిళ్లు కాగా, చిన్న కూతురు బానోత్ తోని(19) వరంగల్ జిల్లా మరిపెడలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నది.
తోనికి, అక్క అత్తగారి ఊరైన మరిపెడ మండలం గుండెపూడికి చెందిన బర్మావత్ మహేందర్తో పరిచయం ఏర్పడింది. ఈనెల 15న కొత్త బట్టలు కొనిస్తానని తోనికి మహేందర్ ఫోన్ చేశాడు. ఆమె ఇంటినుంచి మరిపెడకు రాగానే మహేందర్తోపాటు మరో ముగ్గురు ఊరి శివారుకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను మరిపెడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్లిపోయారు.
అపస్మారకస్థితిలో ఉన్న యువతిని స్థానికులు గమనించిన పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు తోనికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు మహేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. లైంగికదాడికి పాల్పడిన వారిలో మరికొంత మంది ఉన్నారని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.