సర్కార్ ఆస్పత్రిలో దారుణం : ప్రసవం కోసం వస్తే వీడియో తీశారు, విచారణకు కమిటీ
ఖమ్మం : ధర్మాసుపత్రి అని డెలివరీ కోసం వచ్చింది ఆమె. పురిటి నొప్పులు పడుతోన్న ఆమెకు ప్రసవం చేశారు. కానీ ఆ హెడ్ నర్స్ తలతిక్క పనిచేసింది. డెలివరీ చేస్తోన్న సమయంలో వీడియో తీసి తన క్రూరత్వాన్ని చాటుకొంది. డెలివరీ చేస్తోన్న వైద్యులు వద్దని వారించకపోవడం .. ఇక తనకు అడ్డేలేదని భావించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది నర్స్.
వాట్సాప్లో పోస్ట్
ప్రసవంకు సంబంధిచి తన వాట్సాప్లో వీడియో షేర్ చేసింది నర్స్. ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో నర్స్ నిర్వాకంపై నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆమె తీరును తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా వచ్చింది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది సర్కార్.
ఆస్పత్రికొస్తే ..
అమ్మతనానికి గుర్తు ప్రసవం. అలాంటి మహాత్తర పని కోసం ప్రభుత్వాసుపత్రికి రావడమే ఆమె పాపమైంది. సర్కార్ దవాఖాన కదా అని .. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వారిని అడిగేవారు లేకపోవడంతో చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు డెలివరీ చేస్తూనే ... వీడియో తీసి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. ఈ ఘటనను ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, మేధావులు ఖండిస్తున్నారు. ఇదీ సరికాదని .. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదేం పని ?
ఖమ్మం ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి విచారణ కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
సరికాదు ..
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన అభాగ్యురాలికి సంబంధించి వీడియో తీయడంపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీనిపై అన్నిపక్షాలు ఏకమై ముక్తకంఠంతో ఖండించాయి. ఇలాంటి ఘటన సరికాదని .. భవిష్యత్లో రీపిట్ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.