మోత్కుపల్లితో విజయసాయిరెడ్డి భేటీ: అందులో భాగంగానే తెరపైకి... బాబుపై జగన్ ప్లాన్!
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం భేటీ అయ్యారు. విజయసాయి... మోత్కుపల్లి నివాసానికి వెళ్లారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని మోత్కుపల్లి చేసే తిరుమల యాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. అలాగే, వారు భవిష్యత్తుపై చర్చించారు.
మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. బుధవారం కూడా తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ అన్నారు. ఏపీని చంద్రబాబు అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు అని విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతోంది వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. చంద్రబాబు హోదా కోసం పోరాడటం లేదన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కాపులకు, బీసీలకు బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఈ వ్యవస్థలోని చీడ పురుగు చంద్రబాబు అన్నారు.
మరోవైపు, మోత్కుపల్లి వెనుక వైసీపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడం గమనార్హం. దీంతో చంద్రబాబును ఏపీలో దెబ్బతీసేందుకు వైసీపీ మోత్కుపల్లిని కూడా ఉపయోగించుకుంటుందా అనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో గెలుపుపై జగన్ కన్నేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై అందుబాటులోని ఆయుధాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా మోత్కుపల్లి తెరపైకి వచ్చారని అంటున్నారు.