విజయారెడ్డి హత్య ఘటన ... ప్రభుత్వంపై రెవెన్యూ జేఏసీ పోరుబాట .. 30న సింహగర్జన
తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తర్వాత రెవెన్యూ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది . ఆ తర్వాత ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయితే రైతుల నుండి, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అయ్యింది. తహసిల్దార్ విజయ రెడ్డి సజీవదహనం నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఆరోపిస్తూ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
విజయారెడ్డి సజీవదహనం కేసు ... అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
ప్రభుత్వ వైఖరికి నిరసన ..రెవెన్యూ ఉద్యోగుల కార్యాచరణ
ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల విషయంలో పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తితో ఉన్న రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన ఉధృతం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నేత వి. లచ్చిరెడ్డి రెవెన్యూ ఉద్యోగుల కార్యచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈ నెల 13 న ఉద్యోగులంతా పెన్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ 14న ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. ఇక 15 న అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో వంటా-వార్పు కార్యక్రమం చేస్తారు.
ధర్నాలు, విధుల బహిష్కరణ .. ప్రాంతీయ సదస్సులు
16 న భూసంబంధిత విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అత్యవసర సేవలు మాత్రమే చేస్తామని ప్రకటించారు. తమకు భూ సంబంధిత విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే దొంగలని ముద్ర వేసిన నేపథ్యంలో దొంగలకు భూ సంబంధిత రికార్డుల పనులు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు.16 నుండి 22 వరకు ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం సదస్సు ...30న ‘సింహగర్జన'
16న ఖమ్మంలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పూర్వపు జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తారు. 19న కామారెడ్డిలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పూర్వపు జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది రెవిన్యూ ఉద్యోగుల జేఏసీ. ఇక 22న హైదరాబాద్లో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తారు.
ఈ లోపు ప్రభుత్వం స్పందించి తమ విషయంలో నిర్ణయం తీసుకుంటే సరి... లేదంటే 30న ‘సింహగర్జన' పేరుతో హైదరాబాద్లో రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.
విజయారెడ్డి సజీవదహనం తర్వాత దారుణంగా రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి
విజయ రెడ్డి సజీవదహనం తర్వాత రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతులతో గొడవలు నిత్యకృత్యంగా మారాయి .విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు పజల వద్దకు వెళ్లి పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం అని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ నేత లచ్చిరెడ్డి ఆరోపించారు.ఇక అంతే కాదు ఇటీవల ఏసీబీ వలలో చిక్కిన రెవిన్యూ ఉద్యోగుల జాబితాను బయటకు వెల్లడించిన నేపథ్యంలో మరింత ఆగ్రహంతో ఉన్నారు రెవెన్యూ ఉద్యోగులు.
భూ సంబంధిత విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్
58 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్పుస్తకాలను పంపిణీ చేసినప్పటికీ, రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా ప్రజలకు ప్రభుత్వం చూపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్య వల్లే రైతులతో పాటు ఇతరులు రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. అన్ని భూసమ్యలకు ఉద్యోగులే కారణమని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవంగా చట్టాల్లో ఉన్న గందరగోళం, సాఫ్ట్వేర్ సమస్యలు , ఉద్యోగుల కొరత తదితరాలన్నీ భూ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణమన్నారు.
రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసే కుట్ర అని ఆగ్రహం
రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ చేపడుతున్న ఆందోళనకు సహకరిస్తామని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సైతం హామీ ఇచ్చారు. మొత్తానికి ఒకపక్క ఆర్టీసీ కార్మికులతో పాటు, మరోపక్క రెవెన్యూ ఉద్యోగులు సైతం ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం పై సింహ గర్జన చేయనున్నారు. చూడాలి తెలంగాణా సీఎం కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనకు ఎలా స్పందిస్తారో ..