అందుకే రామిరెడ్డి, బూతులు మాట్లాడే...: కేసీఆర్పై విజయశాంతి తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను, కేసీఆర్ సమవుజ్జీలమని, ఆయన కూతురు, కొడుకు కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావులు పిల్లలు అన్నారు.
బాబుతో ముప్పులేదు, కాంగ్రెస్ను గెలిపించేందుకే ఏపీ సీఎం: రేవంత్, ఆ ఆందోళనలో కేసీఆర్: కోదండ
కేసీఆర్ తనకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అని తాను ఎప్పుడూ అనలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తనకు ప్రచార బాధ్యతలు ఉన్నాయని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పలేదు
తనను టీఆర్ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటి వరకు కేసీఆర్ చెప్పలేదని విజయశాంతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం తమ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గెలుస్తుందని, తాము ఇతరుల్లా అబద్దాలు చెప్పడం లేదని, అహంభావంతో మాట్లాడటం లేదని అన్నారు. కేసీఆర్ నోరు విప్పితే అబద్దాలను, వాస్తవాలు ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ఆయన చెప్పింది ఎప్పుడూ చేయలేదన్నారు.
టీడీపీతో వద్దనలేదు, సమీకరణాలు చూసుకోవాలని చెప్పా
తెలుగుదేశం పార్టీతో కలవవద్దని తాను చెప్పలేదని, కానీ సమీకరణాలు మాత్రమే చూసుకోవాలని చెప్పానని విజయశాంతి అన్నారు. రాష్ట్రమంతా పర్యటించాలి కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పారు. తమకు 110 స్థానాలు వస్తాయని కేసీఆర్ చెబుతున్నారని, కానీ మహా కూటమికి ఆ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తాము శత్రువుగా చూడటం లేదని, కానీ ప్రజల కోసం ఏం చేశాడని నిలదీస్తున్నామన్నారు.
అందుకే కేసీఆర్ను రామిరెడ్డి అన్నాను
తెలంగాణ సాధనలో తనకు తాను వంద మార్కులు వేసుకుంటానని విజయశాంతి చెప్పారు. కేసీఆర్తో పంచుకుంటే, ఆయనకు వంద, నాకు వంద అని చెబుతానని అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్దాలను ఇఖ తెలంగాణ ప్రజలు భరించేస్థితిలో, నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. కేసీఆర్ అహంకారంతో కూడిన దొర కాబట్టి సినిమాల్లోని రామిరెడ్డిలా పోల్చానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు అని చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి కేసీఆర్కు వ్యతిరేకత మరింత పెరుగుతోందన్నారు.
బూతులు మాట్లాడే అబద్దపు ముఖ్యమంత్రి
కేసీఆర్ అసభ్యకర భాష మాట్లాడటం సరికాదని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి తదితరులు కూడా మాట్లాడారు కదా అంటే, కేసీఆర్లా మాత్రం మాట్లాడలేదని చెప్పారు. అందుకే ఆయనను తాను బూతులు మాట్లాడే అబద్దపు ముఖ్యమంత్రిగా పిలవాలని అనుకుంటున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతులు తప్పితే ఆయన వద్ద సబ్జెక్ట్ లేదన్నారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు తిట్టడం సరికాదన్నారు.
ఎదిగితే కేసీఆర్ సహించరు
తాను లేదా ఇతరులు టీఆర్ఎస్లో ఎదిగితే కేసీఆర్ సహించలేరని విజయశాంతి చెప్పారు. అందుకే చాలామంది నేతలు తమ వైపు వస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ కీ ఇస్తే, ఇక్కడ కేసీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. కోదండరాం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతూ.. వారి పార్టీ కొత్తది అని, వారి బలం చూసి సీట్లు ఇస్తామని చెప్పారు. ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇవ్వలేమని అభిప్రాయపడ్డారు.
భయపడి పోటీ చేయడం లేదనడం సరికాదు
తాను భయపడి పోటీ చేయడం లేదనే వాదనలను విజయశాంతి కొట్టి పారేశారు. ఏదైనా అనుమానం ఉంటే కేసీఆర్ పైన రావాలని, ఆయనను మాత్రం అడగరని చెప్పారు. 119 సీట్లలో ప్రచారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే పోటీ చేయడం లేదని చెప్పారు. నాలుగు వందలకు పైగా మండలాలు తిరుగుతానని రాహుల్ గాంధీకి హామీ ఇచ్చానని చెప్పారు.
రాములమ్మ పోరాటం చేస్తుంది
రాములమ్మ ఫైటర్ అని, పోరాటం చేస్తుందని (సినిమాలో) ఇక్కడా తాను పోరాడుతానని విజయశాంతి చెప్పారు. మేం కోరుకున్న తెలంగాణ వేరని, అలాంటి తెలంగాణ రాలేదని, కాబట్టి తెరాసను తొలగించి రాష్ట్రంలో జాతీయ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ కోసం 20 ఏళ్లు పోరాడానని, అందుకు తనకు తాను వంద మార్కులు ఇచ్చుకుంటానని చెప్పారు. తాను తెలంగాణ సాధించాలని నిర్ణయించుకున్నప్పుడే బరువుగా భావించలేదని, ఇప్పుడు కూడా అలాగే భావించడం లేదన్నారు. అనారోగ్యం తదితర కారణాల వల్ల ఇన్నాళ్లు దూరంగా ఉన్నానని చెప్పారు.