ఎదురుచూశా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా, గుండెల్లో స్థానంలేదు: కేసీఆర్పై విజయశాంతి
మహబూబ్ నగర్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన ప్రభుత్వం పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపైనర్ విజయశాంతి గురువారం నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ క్లాస్ సెంటర్తో పాటు పలుచోట్ల ఆమె మాట్లాడారు. 2014లో కేసీఆర్ను నమ్మి అప్పుడు ఓట్లు వేశారని, కానీ ఆయన మోసం చేశాడని విజయశాంతి విమర్శించారు.
కేసీఆర్ ఇచ్చే డబ్బుపై విజయశాంతి, నా పేరు చెడగొట్టాడు, నా తమ్ముడ్ని ఓడించండి: అరుణ
ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రజలకు మేలు చేస్తారని ఓటు వేస్తే, ఏం చేశారని, మీకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కూడా ఉన్న సమస్యలు చూస్తుంటే నాకు బాధ వేస్తోందన్నారు. అధికారం వారి కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు.
ఇన్నాళ్లు ఎదురు చూశా
నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను దోచుకున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుస్తుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అనుకున్నామని చెప్పారు. కానీ తెరాస గెలిచిందని, అయినా ఉద్యమం నాటి కేసీఆర్ వేరు, అధికారంలో ఉన్నప్పటి ఇప్పటి కేసీఆర్ వేరు అని చెప్పారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు గాలి వీచిందని, ఉద్యమంలో ఆయన పని చేశారు కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తే ఏమిటని, ఆయన పాలన చూద్దామని ఇన్నాళ్లు ఎదురు చూశానని చెప్పారు.
కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
ఈ నాలుగున్నరేళ్లు టీఆర్ఎస్ పాలనలో దోపిడీ చేశారని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదాలు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, ప్రజా సంక్షేమం కోసమని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. రైతులకు చేయాల్సింది చేయలేదు కాబట్టి వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు.
రైతు గుండెల్లో కేసీఆర్కు స్థానం లేదు
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా పథకాలు తెచ్చారని విజయశాంతి అన్నారు. కానీ రైతు గుండెల్లో మాత్రం కేసీఆర్కు చోటు లేదన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిందని, దానిని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉద్యమం చేసిందే నీళ్లు, ఉద్యోగాలు, స్వయం పాలన కోసమన్నారు. కాన ఉద్యోగాలు రాక యువత నిరాశతో ఎదురు చూస్తోందని వాపోయారు.
కేసీఆర్ పాలన నాకు ఇప్పటికీ అర్థం కాలేదు
కేసీఆర్ పాలన తనకు ఇప్పటికీ అర్థం కాలేదని విజయశాంతి విమర్శించారు. కేజీ టు పీజీ విద్య అని చెప్పి ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం ఘోరం అన్నారు. సీఎం ప్రగతి భవన్లో కూర్చొని పాలిస్తున్నారని విమర్శించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ప్రగతి భవన్కు వస్తే అనుమతించడం లేదన్నారు. ప్రాజెక్టులు, బతుకమ్మ చీరల విషయంలో ప్రజలను కేసీఆర్ మోసం చేసారన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు.
ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు
సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిపించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదిలి కేసీఆర్ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.