కేసీఆర్ తప్పించుకోవటం వెనుక: ఎంఐఎం ప్రాపకం కోసం: విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎందుకు స్పందించలేదని నిలదీసారు. సుప్రీం తీర్పుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే కేసీఆర్ మాత్రం ఎంఐఎం ప్రాపకం కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్ను చూస్తే అర్థమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
కేసీఆర్ జీర్ణించుకోలేకపోతన్నారేమో..
అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించకపోవటాన్ని విజయ శాంతి ప్రశ్నించారు.అదే సమయంలో కేసీఆర్ తీరు పైనా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా, తప్పించుకోవడం వెనక చాలా మతలబ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశమంతా రామమందిరం నిర్మాణానికి సంబంధించి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంటే... తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో... ఎంఐఎం ప్రాపకం కోసం సుప్రీం తీర్పుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ ఆ పోస్టింగ్ లో విమర్శించారు.
రామమందిరం పైన వ్యతిరేకంగా..
పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్ను చూస్తే అర్థమవుతుందంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే కేసీఆర్ మాత్రం ఎంఐఎం ప్రాపకం కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ తెలంగాణ సమస్యల మీద కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే రాములమ్మ ఇప్పుడు ఇలా..రామమందిరం పైన తీర్పుకు అనుకూలగా స్పందించలేదంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ...పరామర్ధం ఏంటనే చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా విజయశాంతి బీజేపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా విజయశాంతి పోస్టింగ్ లతో ఆ చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది.
దొరగారి అసలు నైజం..
రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని... అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కెసిఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనమని విజయశాంతి పేర్కొన్నారు. ఇంతకు ముందు తన మనసులోని మాటను బయటపెట్టిన కెసిఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోతున్నారేమో.. దీన్నే కుహనా లౌకిక వాదం అంటారు... గతంలో కెసిఆర్ గారు రామమందిరం పై ఏమన్నారో, ఈ వీడియో చూస్తే, దొరగారి అసలు నైజం అర్థమవుతుందంటూ విజయశాంతి పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు దీన మీద టీఆర్ యస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.