కేసీఆర్ ఇప్పటికీ చెప్పలేదు, నేను పోటీ చేయను: విజయశాంతి, మేమే కీలకం: కోదండరాం
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సోమవారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా తాను తెలంగాణవ్యాప్తంగా ప్రచారం చేస్తానని చెప్పారు.
430 మండలాల్లో ప్రచారం చేస్తానని తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి చెప్పానని అన్నారు. తనను తెరాస నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటి వరకు చెప్పలేదని ఆమె అన్నారు. ఫెడరల్ ఫ్రంట్కు జాతీయ పార్టీలను ఒప్పించలేని కేసీఆర్ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కాళ్ల పైన పడి పార్టీని కలిపేస్తానని మాట ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ అహంకారపు మాటలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మాదే కీలక పాత్ర: కోదండరాం
వచ్చే ఎన్నికల్లో తమది కీలక పాత్ర అని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం వేరుగా అన్నారు. ప్రజలు ఆకాంక్షించిన రాష్ట్రం సాకారం కాలేదన్నారు. ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులను ఎత్తివేయలేదని, ఏ ఒక్క కుటుంబానికీ సాయం అందలేదన్నారు.
ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తామే కీలకపాత్ర పోషిస్తామన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతం, ఉద్యమ ఆకాంక్షల సాధనే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఎన్నడూ తెలంగాణలో ఉద్యమంలో లేని వాళ్లు, ఉద్యమానికి అడ్డం పడిన వాళ్లే ప్రభుత్వంలో కీలక పదవులు సంపాదించుకున్నారన్నారు.