కేసీఆర్ పక్కనే కుట్ర..పోటీలో ఎవరు: సీఎం భయానికి కారణం అదే : విజయశాంతి ఫైర్..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ కేసులో హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దీని పైన స్పందించిన విజయశాంతి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా కుట్ర చేసింది కేసీఆరే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి, విలువలకు తిలోదకాలిచ్చింది కూడా కేసీఆరే అంటూ మండిపడ్డారు.
ఆ కుట్ర చేసింది కేసీఆరే..
ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి తీవ్ర విమర్శలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని హైకోర్టుకు విన్నవించడాన్ని ఖండించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ కుట్రలు జరగకుండానే, తెలంగాణలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా కుట్ర చేసింది కేసీఆరే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదానా..
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారని..అందులో భాగంగానే మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి.. విలువలకు తిలోదకాలిచ్చింది కూడా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన పక్కన ఉన్న వారు కుట్ర చేస్తే, ఆ నిజాన్ని బయట పెట్టలేక.. ప్రతిపక్షాల మీదకు ఆ నెపాన్ని నెట్టి వేసేందుకు దొరగారు ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగుతోంది.
దీనికి కారణం లేకపోలేదు. టీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు... కొందరు మంత్రులు కూడా తమతో టచ్ లో ఉన్నారనంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి బెంబేలెత్తిపోయి ఇటువంటి అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారన అనుమానం కలుగుతుందన్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ప్రకటనను విజయ శాంతి ప్రస్తావించారు.
ఆ సీటు కోసం పోటీ పడేదెవరు..
టీఆర్ యస్ నేతలు బీజేపీ పేరును ప్రస్తావించటానికి భయపడి.. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని తమ భయానని కోర్టు ద్వారా తెలియ చేసి ఉంటాని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇంతకీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్ర చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. ఆ పేర్లను ముఖ్యమంత్రి బయట పెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీసారు.
ఈ కుట్రలో మంత్రులు కూడా భాగస్వాములేనా అని ప్రశ్నించారు రాములమ్మ. ఇక వేళ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే..సీఎం సీటు కోసం పోటీ పడేదెవరని ప్రశ్నించారు. ఈ అనుమానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుండే సమాధానం రావాలని అని విజయ శాంతి డిమాండ్ చేసారు.