టీడీపీకి గట్టి షాక్: పొత్తుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు, చంద్రబాబు ఆశలపై నీళ్లు?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితిలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నాయి. పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది దాదాపు ఖరారైంది. పొత్తులకు తాను వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు మిత్రపక్షాలు కోరవద్దని కాంగ్రెస్ ప్రచార సారథి విజయశాంతి గతంలో విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబూ! తట్టుకోలేవ్: తలసాని తీవ్రఆగ్రహం, జగన్ మీద దాడిపై శ్రీరెడ్డి ట్వీట్, రివర్స్
తాజాగా మరోసారి ఆమె ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె చెప్పారు. ఈ పొత్తులో భాగంగా కొన్ని పరిమితులను తాము నిర్దేశించుకున్నామని వ్యాఖ్యానించారు.
విజయశాంతి కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీతో కొన్ని అంశాల్లో హద్దులను నిర్దేశించుకున్నామని విజయశాంతి చెప్పారు. ఇదే విషయాన్ని (టీడీపీతో కొన్ని అంశాల్లో హద్దులను నిర్దేశించుకొని) తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించామని చెప్పారు. మహాకూటమి సీట్ల పంపకంపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రెండు రోజుల క్రితం భేటీ అయిన నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు.
మెజార్టీ సీట్లు రాకుంటే కూటమి ప్రభుత్వం
విజయశాంతి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేతలకు షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 90కి పైగా స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి కారణంగా తమకు సంపూర్ణ మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. మెజార్టీకి కావాల్సిన సీట్లు రాకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
కాంగ్రెస్ గెలిస్తే నామినేటెడ్ పోస్టులపై టీటీడీపీ ఆశలు
మహాకూటమితో వెళ్తున్నందున తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత తమకు నామినేటెడ్ పోస్టుల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదవులు వరిస్తాయని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పారు. గెలిచే సీట్లు అడుగుదామని, కూటమి గెలుపే ముఖ్యమని, కూటమి గెలిస్తే ఆ తర్వాత పదవులు వస్తాయని చెప్పారు.
టీడీపీకి షాకిచ్చేలా విజయశాంతి వ్యాఖ్యలు
కానీ విజయశాంతి వ్యాఖ్యలు టీడీపీకి షాకిచ్చేలా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వస్తే టీడీపీకి నామినేటెడ్ వంటి పోస్టుల్లో అవకాశం చాలా చాలా తక్కువగా ఉండటం లేదా అసలు ఉండకపోవడం జరుగుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లినట్లే అవుతుందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ సొంతగా గెలిచే అవకాశాలు లేవని, అప్పుడు తాము చక్రం తిప్పవచ్చునని టీడీపీ కూడా భావిస్తోంది. అందుకే గెలిచే కీలక స్థానాలు మాత్రమే కోరుతోందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి అలా జరిగే అవకాశాలు లేవనే వారూ లేకపోలేదు.