మంత్రులులేని ప్రభుత్వం-నీళ్లులేని ఫైరింజన్లు: నాంపల్లి ప్రమాదంపై విజయశాంతి నిప్పులు
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గురువారం స్పందించారు. ఆమె తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులు లేని ప్రభుత్వం.. నీళ్లు లేని ఫైరింజన్లు అని ఎద్దేవా చేశారు.
ప్రజల ప్రాణాలు అంటే విలువ తెలియని పాలన ప్రజా పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది మన నేటి తెలంగాణ దుస్థితి అని వాపోయారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా రాజకీయ కారణాలతో మంత్రులను నిర్ణయించకపోవడం విడ్డూరమని చెప్పారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్నారు. ఇలాంటి దుస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలు ఇలాంటి పాలనను కోరుకోలేదని చెప్పారు.
కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ఎగ్జిబిషన్ మైదానంలో సందర్శకులు కిక్కిరిసిపోయారు. మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు తరలి వచ్చారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది. సంఘటన స్థలానికి నాలుగు ఫైరింజన్లు వచ్చాయి. మంటలను అదుపు చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా గురువారం స్పందించింది. నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ప్రకటించింది. ఆ మేరకు ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ పాలకమండలి ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. జరిగిన నష్టంపై రెవెన్యూ యంత్రాంగం అంచనా వేస్తోందని, నివేదిక వచ్చాక నష్ట పరిహారం ఏ మేర చెల్లించాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగలేదని ధృవీకరించారు.