పవన్ కళ్యాణ్ దారిలో 'రాములమ్మ': విజయశాంతి చక్రం తిప్పేనా?
హైదరాబాద్: రాములమ్మ.. విజయశాంతి మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అందుకు ఆమె సినిమాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మళ్లీ సినిమాలలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే రెండు పెద్ద సినిమాలను ఒప్పుకున్నారని కూడా చెబుతున్నారు. అందుకు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒసేయ్ రాములమ్మ చిత్రం ఎంత పెద్ద విజయవంతమైందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్గా మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో మళ్లీ మాస్లో ఇమేజ్ పెంచుకోవడంతో పాటు, దానిని తన పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో తన పొలిటికల్ కెరీర్ కూడా మలుపు తిరుగుతుందని భావిస్తున్నారని సమాచారం.
విజయశాంతి బిజెపిలో, కొత్త పార్టీ (తల్లి తెలంగాణ పార్టీ), తెరాసలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెరాస తనను పార్టీ నుంచి బహష్కరించడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, తెలంగాణలోను, కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆమె రాజకీయాల్లో క్రియాశీలంగా కనిపించడం లేదు. తాజాగా, మళ్లీ ఆమె క్రియాశీలక రాజకీయాల పైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఓ సినిమా ద్వారా సన్నద్ధం కావాలని భావిస్తున్నారట.
2018ని ఆమె క్రియాశీలక రాజకీయాలకు టార్గెట్గా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఓ విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దారిలో నడిచేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ లోగా రెండు మూడు సినిమాల్లో నటిస్తానని చెప్పారు.
2019లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయశాంతి 2018ని టార్గెట్గా పెట్టుకొని ఆమె సినిమాలు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారనే చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమైంది.
ఆయన ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అంటున్నారు. అదే సమయంలో, సినిమాల ద్వారా ప్రాభవాన్ని తిరిగి పొంది, మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోను విజయశాంతి చక్రం తిప్పనున్నారా? రీ ఎంట్రీ ఇస్తే ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు? కాంగ్రెస్ పార్టీలోనైనా చక్రం తిప్పగలరా? అనే చర్చ సాగుతోంది.