దూకుడు ఆగొద్దు: బండి సంజయ్తో అమిత్ షా, భేటీలో విజయశాంతి, 7న బీజేపీలోకి
న్యూఢిల్లీ: అంతా ఊహించిన విధంగానే జరుగుతోంది. తాజాగా, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయశాంతి.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఇక కాషాయ కండువా కప్పుకోవడమే ఆలస్యం.
ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర నేతలతో విజయశాంతి..
ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన విజయశాంతి.. ఢిల్లీలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ను కలిశారు. వారితో సమావేశమై కాసేపు చర్చలు జరిపారు. విజయశాంతి బీజేపీలో చేరతారని ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అమిత్ షాతో విజయశాంతి భేటీ..
బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ అనంతరం వారితో కలిసి విజయశాంతి కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. కాసేపు వారు చర్చలు జరిపారు. సోమవారం బీజేపీలో విజయశాంతి చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా కప్పుకోనున్నారు. దీంతో గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడనుంది.
ఫైర్ బ్రాండ్ మళ్లీ బీజేపీలో..
కాంగ్రెస్ పార్టీకి గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న విజయశాంతి తాజాగా, ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం బీజేపీలో చేరనున్నారు. ఫైర్ బ్రాండ్గా పేరున్న విజయశాంతి.. నేరుగా సీఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. విజయశాంతి పార్టీ మార్పు అటు బీజేపీకి, ఇటు ఆమెకు కూడా కలిసి వచ్చే అంశంగానే చెప్పవచ్చు. ఇటీవల దుబ్బాక, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే.
Recommended Video
ఇదే దూకుడు: బండి సంజయ్
కాగా, అమిత్ షాతో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఫలితాలపై రాష్ట్ర నేతలను అమిత్ షా అభినందించారని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే దూకుడుతో వెళ్లాలని ఆయన సూచించారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. తెలంగాణలో అసలైన ఉద్యమకారులను టీఆర్ఎస్ విస్మరిస్తోందని, ఈ వైఖరి కారణంగానే వారు బీజేపీలోకి వస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారని, సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె బీజేపీలో చేరతారని బండి సంజయ్ వెల్లడించారు.