తెరమరుగు: రాములమ్మతో భేటీకి కెసిఆర్ నో
హైదరాబాద్: తెలంగాణ రాములమ్మ, ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెసు పార్టీ నుంచి శాసనసభకు పోటి చేసి ఓడిపోయిన ఆమె ఆ తర్వాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోనూ బిజెపిలోనూ చేరడానికి ప్రయత్నించినట్లు సమాచారం.
అయితే, రాములమ్మను కలిసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమయం ఇవ్వలేదని చెబుతున్నారు. అదే సమయంలో స్థానిక నాయకత్వం విజయశాంతిని పార్లీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం. కాంగ్రెసు పార్టీకి కూడా ఆమె దూరమయ్యారు.
రాజకీయాల నుంచి ఆమె దాదాపుగా తెరమరుగయ్యారనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్లో ఆమె క్రియాశీలకు పాత్ర పోషించారు. ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్లో చేరారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ఉద్యమంలో పాలుపంచుకున్న విజయశాంతి ఆ తర్వాత ఆ పార్టీని టిఆర్ఎస్లో విలీనం చేశారు. ఫలితంగా 2009 ఎన్నికలలో మెదక్ పార్లమెంటు స్థానాన్ని పొందిన ఆమె ఘన విజయం సాదించారు.
ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మొదట్లో నే ఆమె కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వల్ల, కెసిఆర్ ఆమరణ దీక్ష తరువాత టిఆర్ఎస్ పుంజుకోవడం వల్ల ఆమె తెరాసలోనే ఉండిపోయారు.
గత సార్వత్రిక ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాములమ్మ ప్రస్తుత డిప్యూటి స్పీకర్ పద్మదేవెందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్య క్రమాలకు కూడా విజయశాంతి దూరంగా ఉంటున్నారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించినప్పటకి ఆమె అందుకు అంగీకరించలేదు. ఆ ఎన్నికలలో కనీసం ప్రచారం లో కూడా పాలు పంచుకోలేదు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక, నారాయణఖేడ్, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ ఎన్నిక లకు కూడ ఆమె పూర్తిగా దూరంగా ఉన్నారు.
ఎన్నికలలో ఓటమి తరువాత ఆమె తెరాసలో చేరేందుకు కూడా ప్రయత్నించారని సమాచారం. ఇందుకుగాను కెసిఆర్ అపాయింట్మెంటు కోసం విజయశాంతి ప్రయత్నించారని, అయితే ఆమెకు కెసిఆర్ అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో ఆమె ఇంటికే పరిమితమైనట్లు చెబుతున్నారు.