కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్: విజయశాంతి రాజీనామా? నేడే ఢిల్లీకి రాములమ్మ, బీజేపీలోకి!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె ఆదివారం రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమె.. ఇప్పుడు సొంత గూటికి చేరుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి విజయశాంతి..
నేటి సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న విజయశాంతి కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిసింది. విజయశాంతి పార్టీ చేరిక, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పెద్దలను కలవనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీతో పెరిగిన దూరం..
కాగా, విజయశాంతి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్బంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా.. రాష్ట్ర నాయకత్వం సహకరించకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కీలక సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ప్రచారం చేయలేదు.
బీజేపీవైపే విజయశాంతి..
ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా మాణిక్యం ఠాకూర్ తొలిసారి రాష్ట్రానికి వచ్చినా.. ఆమె పట్టించుకోలేదు. ఆమెకు ఆహ్వానం అందినా పార్టీ సమావేశాలకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నెలలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. విజయశాంతి ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆమె కాషాయ పార్టీలోకి వెళుతున్నట్లు సంకేతాలిచ్చారు.కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించినా ఆమె వినలేదని తెలిసింది.
Recommended Video
కొత్త బీజేపీకి విజయశాంతి ప్లస్సే..
ఇక బీజేపీ అగ్ర నేతలతోపాటు రాష్ట్ర నేతలు కూడా విజయశాంతి రాకను స్వాగతిస్తుండటం గమనార్హం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పలుమార్లు విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు తగిన గుర్తింపు లేదన్నారు. అంతేగాక, తాజాగా, ఒకటి రెండ్రోజుల్లో విజయశాంతి బీజేపీలో చేరతారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి రాజీనామా చేసినట్లు తెలిసింది. కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న బీజేపీకి విజయశాంతి రాక కూడా ఆ పార్టీకి కొంతమేర మైలేజ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.